టీకాల కోసం హైదరాబాద్ ఫార్మా కంపెనీకి యూఎస్ ఆర్థిక సహాయం

by Shamantha N |   ( Updated:2021-03-12 22:14:41.0  )
టీకాల కోసం హైదరాబాద్ ఫార్మా కంపెనీకి యూఎస్ ఆర్థిక సహాయం
X

న్యూఢిల్లీ : కరోనా టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీకి ఆర్థికంగా సహాయపడనున్నట్టు అమెరికా వెల్లడించింది. 2022 చివరికల్లా కనీసం వంద కోట్ల డోసులను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఈ సహాయాన్ని అందించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌‌లోని బయోలాజికల్ ఈ లిమిటెడ్‌కు అమెరికా ప్రభుత్వం డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(డీఎఫ్‌సీ) ద్వారా నిధులను అందించనుంది. ప్రపంచ ఆరోగ్యం సంస్థ ఆమోదం, అత్యవసర వినియోగానికి లిస్టింగ్ చేయనున్నట్టు యూఎస్ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని యోషిహిదే సుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌లతో భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం క్వాడ్ సదస్సులో భాగంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఇండో పసిఫిక్ రీజియన్‌లో టీకా సమస్యను పరిష్కరించే లక్ష్యాన్ని దేశాధినేతలు నిర్ణయించుకున్నారు. ఇందుకు అనుగుణంగా భారత్‌లో టీకా ఉత్పత్తిదారులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి అమెరికా, జపాన్‌‌లు సంసిద్ధతను తెలుపగా, సరఫరా, లాజిస్టిక్ సంబంధిత సహాయానికి ఆస్ట్రేలియా అంగీకరించింది. ఈ సదస్సు తర్వాత అమెరికా వైట్‌హౌజ్ కీలక ప్రకటన చేసింది. సదస్సులో కుదిరిన అంగీకారాలకు అనుగుణంగా భారత్‌లో టీకా ఉత్పత్తిదారులకు ఆర్థిక సహాయాన్ని అందించడంపై ప్రకటన వెలువరించింది. బయోలాజిక్ ఈ లిమిటెడ్‌‌లో 2022 చివరికల్లా వంద కోట్ల డోసుల ఉత్పత్తి లక్ష్యంగా డీఎఫ్‌సీ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు వెల్లడించింది. ఈ ఒప్పందం గురించి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా మాట్లాడుతూ, ఇది కేవలం భారత్‌లో అదనపు సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయడానికేనని స్పష్టం చేశారు. దీనివల్ల దేశీయంగా ఎలాంటి ప్రభావమూ ఉండదని వివరించారు. దేశీయంగా టీకా ఉత్పత్తి, పంపిణీపై ఎఫెక్ట్ కాదని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed