రెండు 108 అంబులెన్సులు : నిండు ప్రాణం బలి 

by  |
రెండు 108 అంబులెన్సులు : నిండు ప్రాణం బలి 
X

వైద్యం సరైన సమయానికి అందక ఎందరో ప్రాణాలు కోల్పోవడం తెలుసు. కొన్ని ప్రాంతాల్లో కనీసం అంబులెన్సులు వెళ్లే సౌకర్యం కూడా లేక నానా తిప్పలు పడుతూ ఆసుపత్రికి వెళ్లే దారిలోనే బాధితులు మరణించిన ఘటనలు ఉన్నాయి. కానీ శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటన ఇందుకు భిన్నం. ఇక్కడ సమయం ఉంది, రోడ్డు సౌకర్యం ఉంది. అంబులెన్సు కూడా వచ్చింది. ఒకటి కాదు రెండు అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి. ఇదే రోగి ప్రాణాలు కోల్పోవడానికి కారణమవడం బాధాకరం.

వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా, ముచ్చింద్ర గ్రామంలో ఒక మహిళను పాము కాటేసింది. ఆమెను వెంటనే ఇచ్చాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. ఆమె పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం రిమ్స్ హాస్పిటల్ కు తరలించాలని చెప్పారు. ఇచ్చాపురం 108 ను కరోనా పేషేంట్లకు కేటాయించిన కారణంగా కవిటి నుండి మరో అంబులెన్సును రప్పించారు ఆసుపత్రి సిబ్బంది. ఆమెను సదరు అంబులెన్సులో రిమ్స్ కి తరలించేందుకు సిద్ధం చేస్తుండగా… ఇచ్చాపురం 108 సిబ్బంది గొడవకు దిగారు.

మేము ఉండగా కవిటి నుండి అంబులెన్సును ఎందుకు రప్పించారంటూ వాగ్వాదానికి దిగారు. సుమారు గంటపాటు రెండు అంబులెన్సులు సిబ్బంది మధ్య వాదనలు జరిగాయి. దీంతో పాము కాటుకు గురైన బాధితురాలు అంబులెన్సు ఎక్కకుండానే చనిపోయింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరొకరు సర్దుకుని సరైన సమయానికి బాధితురాలిని రిమ్స్ కి తరలిస్తే ప్రాణాలు దక్కేవని వాపోతున్నారు.


Next Story

Most Viewed