నిజాయితీపరుడినే సీఎంగా ఎన్నుకున్నారు: విజయోత్సవ ర్యాలీలో కేజ్రీవాల్

by Disha Web |
నిజాయితీపరుడినే సీఎంగా ఎన్నుకున్నారు: విజయోత్సవ ర్యాలీలో కేజ్రీవాల్
X

అమృత్‌సర్: పంజాబ్ ప్రజలు రాష్ట్రానికి నిజాయితీ పరుడైన సీఎంను ఎన్నుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాష్ట్రంలో భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఆదివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. 'రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత ప్రజలు నిజాయితీ గల సీఎంను ఎన్నుకున్నారు. మీరు అద్భుతం చేశారు. నేను పంజాబ్‌ను ప్రేమిస్తున్నాను. పంజాబ్ కొత్త మార్పును తీసుకొచ్చిందని ప్రపంచం మొత్తం గుర్తించింది.

అయితే ఇంత భారీ మొత్తంలో ఆధిక్యం వస్తుందని ఊహించలేదు. సుఖ్బీర్ జీ, ప్రకాష్ సింగ్ బాదల్ జీ, మన్ ప్రీత్ బాదల్, సీఎం ఛన్నీ, సిద్ధూ అందరూ ఓడిపోయారు' అని అన్నారు. పంజాబ్‌లో ఇక డబ్బు మొత్తం ప్రజల కోసమే ఖర్చు పెడతామని చెప్పారు. హమీలు అన్ని నేరవేర్చి, సంతోషకరమైన పంజాబ్‌ను చూపిస్తామని తెలిపారు. కాబోయే సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. 'పోలీసులు ఎందుకు ఉన్నారో దానికే మేము ప్రాధాన్యత కల్పిస్తాం. దాదాపు 122 మందికి భద్రతను తగ్గించాం. దీంతో 403 పోలీసు సిబ్బంది, 27 పోలీసు వాహనాలు స్టేషన్లు చేరాయి' అని అన్నారు. ఇతర పార్టీలు కూటమిలుగా ఏర్పడి పంజాబ్‌లో అధికారంలోకి రావడానికి ప్రయత్నించాయని అన్నారు. అయితే పంజాబ్ ప్రజలంతా ఏకమై ఆప్‌కు అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. కాగా రోడ్ షో‌కు ముందు కేజ్రివాల్‌తో కలసి భగవంత్ మాన్ స్వర్ణ దేవాలయంతో పాటు దుర్గా టెంపుల్, జలియన్‌వాలా‌బాగ్ స్మారకాన్ని సందర్శించారు. కాగా, పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం బుధవారం జరగనుంది.

Next Story