ఏం చేద్దాం.. హైకోర్టు తీర్పుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

by Disha News Web Desk |
ఏం చేద్దాం.. హైకోర్టు తీర్పుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
X

దిశ, ఏపీ బ్యూరో : అమరావతిపై రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. హైకోర్టు తీర్పు పట్ల ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులు, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్ల అంశంలో హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడంతో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై తర్జనభర్జన చేస్తున్నారు.

మరోవైపు ఇప్పటికే త్రిసభ్య ధర్మాసనం వెల్లడించిన తీర్పు కాపీ బయటకు విడుదలవ్వడంతో ఆ తీర్పుకాపీలోని అంశాలను న్యాయనిపుణులు సీఎం జగన్‌తోపాటు ఇతర సిబ్బందికి తెలియజేస్తున్నారు. ఇకపోతే మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం దూకుడు పెంచుతున్న తరుణంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అమరావతి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని.. సీఆర్డీఏను అమలు చేయాలని.. మాస్టర్ ప్లాన్ మార్చొద్దు.. భూములు తనఖా పెట్టేందుకు వీల్లేదు.. కార్యాలయాలు తరలించొద్దు అంటూ ఇలా కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. త్రిసభ్య ధర్మాసనం తీర్పు పట్ల ఎలా ముందుకు వెళ్లాలి..? సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై చర్చిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఏపీ రాజధాని అమరావతి పై ఏపీ హైకోర్టు తీర్పు ప్రకటించింది. రాజధాని రైతులకు భారీ ఊరట ఇస్తూనే.. ప్రభుత్వానికి కాస్త ఎదురుదెబ్బ తగిలేలా కీలకమైన స్టేట్ మెంట్స్ ఇచ్చింది ధర్మాసనం. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనేదానిపై ఏపీ హైకోర్టు స్పష్టత వచ్చినట్టైంది. ఏపీ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు తాజాగా వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ఏపీ ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఆ ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.



Next Story