- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ఆ మండలంలో 80 చెరువుల ఆక్రమణ
దిశ, మంగపేట : మండలంలో ఉన్న సుమారు 80 పెద్ద, చిన్న, మధ్యతరహా చెరువులు, కుంటలు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురయ్యాయి. దీంతో చెరువులు కబ్జాదారుల చెర వీడేదెన్నడని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆక్రమణదారులపై కొరడా జులిపించి చెరువులు, కుంటలను కాపాడాలచాలని కోరుతున్నారు. మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో 1500 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న చెరువులు ఉన్నాయి. మరో 65 చెరువులు, కుంటలు వంద లోపు ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇవే కాక రూ.లక్షల విలువైన రెవెన్యూ, అటవీ భూములను సైతం ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విలువైన భూములు గడచిన 10 ఏళ్లలో అన్యాక్రాంత మయ్యాయి. ఆ భూములో అడ్డగోలుగా నిర్మాణాలు జరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ భూముల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు..
మండల కేంద్రంతో పాటు మంగపేట-భూర్గంపహాడ్ డబుల్ లేన్ ప్రధాన రహదారిపై మేజర్ గ్రామాలుగా ఉన్న అమలాపురం, నర్సాపురం బోరు, మల్లూరు, చుంచుపల్లి, వాడగూడెం, రమణక్కపేట, రాజుపేట, దోమెడ చెక్పోస్టు వరకు ఉన్న గ్రామాల్లోని విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఆక్రమించుకుని భవన నిర్మాణాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భవన నిర్మాణ సమయంలో ఉన్న ఆయా అధికారులను మచ్చిక చేసుకున్న ఆక్రమణదారులు రూ.లక్షల విలువైన ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. ఇదంతా కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆక్రమణలపై కొరడా జులిపించాలి..
మండలంలోని చెరువులు, కుంటల ఆక్రమణతో పాటు విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కొరడా జులిపించాలని మండల ప్రజల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. హైదరాబాద్లోని హైడ్రా తరహాలోనే ప్రతి మండలంలో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఆక్రమణలకు గురైన మండలంలోని చెరువులు, కుంటల తో పాటు విలువైన ప్రభుత్వ ఆస్తులను గుర్తించి సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కలెక్టర్కు నివేదికలిచ్చాం
మండలంలోని చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల ఆక్రమణలపై అప్పటి కలెక్టర్ ఇలా త్రిపాఠికి నివేదికలిచ్చాం. మండలంలోని పెద్ద చెరువులలో జరిగిన ఆక్రమణలను నివారించేందుకు ఐబీ శాఖ నుంచి తూముల నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోలేదు. దీంతో వాటికి టెండర్లు పిలవలేదు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదికలిచ్చాం. అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.:- వీరాస్వామి, తహసీల్దార్, మంగపేట
80 శాతం చెరువుల్లో ఆక్రమణలు
మండలంలోని 80 పెద్ద, చిన్న చెరువులు, కుంటలలో దాదాపుగా ఆక్రమణలోనే ఉన్నట్లు గుర్తించాం. మండలంలోని మల్లూరు అత్తా కోడలు, నర్సాపురం బోరు చెరువుల ఆక్రమణలపై దిశలో వచ్చిన కథనానికి స్పందించిన అప్పటి కలెక్టర్ ఇలా త్రిపాఠి చెరువుల ఆక్రమణలపై రెవెన్యూ, ఐబీ శాఖలతో ఉమ్మడి సర్వేకు ఆదేశించారు. తర్వాత ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో సర్వే చేయడం వీలు కాలేదు. ఐబీ శాఖలో సిబ్బంది కొరతతో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ణయించినప్పటికీ రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పాటు చేసి ట్రెంచ్ కొట్టాల్సి ఉంది. త్వరలోనే ఇరు శాఖలతో కలిసి సర్వే పనులు చేపడుతాం.:- వలీం మహమ్మద్, ఏఈ, ఐబీ