TG High Court: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

by Shiva |
TG High Court: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విజయసేన్‌రెడ్డి బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. అయితే, ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావ్‌లు రాజకీయ లబ్ధి కోసమే పార్టీ మారారంటూ బీఆర్ఎస్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ ‌రావు తన వాదనలు వినిపించారు. అదేవిధంగా మూడు నెలల్లోపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఇక మణిపూర్, హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడు ఆ రాష్ట్రాల్లోని కోర్టులు వెలువరించిన తీర్పులను ధర్మాసానికి విన్నవించారు. స్పీకర్‌కు, మణిపూర్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన కాపీని సైతం కోర్టుకు అందజేశారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ స్పీకర్‌కు న్యాయస్థానాలు స్పీకర్ ఆదేశాలు ఇవ్వడం వీలు పడదంటూ తన వాదనలు వినిపించారు. ప్రజల చేత ఎన్నికైన నాయకుల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హాజరై ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ తగిన పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేస్తున్నామని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed