మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై రేవంత్ సర్కార్ సీరియస్ ఫోకస్

by karthikeya |
మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై రేవంత్ సర్కార్ సీరియస్ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై రాష్ట్ర సర్కారు సీరియస్‌గా ఉన్నది. డీమ్డ్ హోదాతో లోకల్ కోటా సీట్లకు గండి కొడుతున్నారని ఇటీవల మెడికల్ స్టూడెంట్స్, పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అయితే వైద్య కళాశాల అనేది నేషనల్ మెడికల్ కమిషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం దానికి అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్ పరిస్థితులపై విచారణ చేయనున్నది. ఇందుకోసం తొలుత నోటీసులు జారీ చేయాలని వైద్యారోగ్యశాఖ సూత్రపాయంగా నిర్ణయించింది. దీంతో పాటు మరి కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న (డీమ్డ్ హోదాలో ఉన్నవి) హాస్పిటల్స్‌కూ నోటీసులు జారీ చేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

‘ఆరోగ్యశ్రీ’పై ఆరా

మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పై ఇప్పటి వరకు ఎంత మంది పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించారు? ఎన్ని సర్జరీలు జరిగాయి? ఎన్ని డెలివరీలు చేశారు? వంటి డీటేయిల్స్ సేకరించనున్నారు. గడిచిన మూడేండ్లుగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆయా ఆస్పత్రులకు చేసిన చెల్లింపులు ఎంత? అనే దానిపై సర్కారు వివరాలు తయారుచేస్తున్నది. తప్పుడు వివరాలని తేలితే వెంటనే ఆరోగ్యశ్రీ ఎంపానెల్‌మెంట్ రద్దు చేయాలని ఆలోచిస్తున్నది. అంతేగాక డీమ్డ్ హోదాతో లోకల్ కోటా రిజర్వేషన్ అమలు చేయనందున, ఈ కాలేజీపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అని ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నది. ఇదే అంశంపై వైద్యారోగ్యశాఖ మంత్రి బుధవారం ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు. డీమ్డ్ వర్సిటీ యాక్ట్, రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన విధానం, సీట్లకు జరుగుతున్న నష్టంపై ఆరా తీయనున్నారు. ఆఫీసర్లు ఇచ్చే నివేదికను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకునే చాన్స్ ఉన్నదని సచివాలయ వర్గాలు తెలిపాయి.

ఎన్‌వోసీపై అనుమానం?

మెడికల్ కాలేజీలకు, యూజీసీకి అసలు సంబంధం ఉండదని వైద్యాధికారులు చెప్తున్నారు. కాలేజీల అనుమతులు, పర్యవేక్షణ వ్యవహారాలన్నీ నేషనల్ మెడికల్ కమిషనే చూస్తుంది. డీమ్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకుంటే, ఆయా కాలేజీ అప్పటికే అఫిలియేట్ అయిన వర్సిటీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. యూజీసీ నిబంధనలు ఇవే స్పష్టం చేస్తున్నాయి. అయితే మల్లారెడ్డి కాలేజీలకు అసలు తాము ఎన్‌వోసీ ఇవ్వలేదని, అయినా డీమ్డ్‌ హోదా తెచ్చుకున్నారని కాళోజీ హెల్త్ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఫీజుల విషయంలోనూ ఎన్‌ఎంసీ నుంచి స్పష్టమైన గైడ్‌లైన్స్‌ ఉన్నాయని, 50 % సీట్లకు రాష్ట్ర సర్కారు నిర్ణయించిన ఫీజులనే చార్జ్ చేయాల్సి ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ, ఈ రూల్సేవీ మల్లారెడ్డి కాలేజీ పాటించడం లేదనే విమర్శలున్నాయి. దీంతో నిబంధనలు ఉల్లంఘనల కింద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. మరి కొన్ని ప్రైవేటు వర్సిటీల పరిధిలోని కాలేజీలపైనా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

కొత్త నిబంధనలు?

డీమ్డ్ వర్సిటీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా అమలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేనున్నది. డీమ్డ్‌ వర్సిటీలైనా, ప్రైవేటు నివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలైనా సగం సీట్లను కన్వీనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని ఆలోచిస్తున్నది. ఈ అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని మెడికల్ ఎడ్యుకేషన్, కాళోజీ హెల్త్ వర్సిటీ ఆఫీసర్లను ఇప్పటికే హెల్త్ మినిస్టర్ రాజనర్సింహ ఆదేశించారు. మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు ఇటీవలే యూజీసీ డీమ్డ్ వర్సిటీగా అనుమతులు ఇచ్చింది. దీని వల్ల కన్వీనర్ కోటాలోకి రావాల్సిన 200 ఎంబీబీఎస్ సీట్లు, వంద బీడీఎస్‌ సీట్లు మేనేజ్‌మెంట్ కోటాలోకి మారిపోయాయి. అపోలో, సీఎంఆర్ సహా మరో 4 కాలేజీలు కూడా డీమ్డ్ హోదా కోసం యూజీసీ వద్ద ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటికి కూడా యూజీసీ నుంచి అనుమతులు వస్తే, దాదాపు 400 సీట్లకు పైగా కన్వీనర్ కోటా సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉన్నది. తద్వారా రాష్ట్రానికి చెందిన లోకల్ స్టూడెంట్లకు నీట్‌లో మంచి ర్యాంకులు వచ్చినా, ఆయా కాలేజీల్లో సీట్లు లభించవు. భవిష్యత్తులో ఈ కల్చర్ మరింత ప్రమాదకరంగా పెరగకముందే అడ్డుకోవాలని సర్కారు భావిస్తున్నది. దీని వల్ల తెలంగాణ విద్యార్థులకు మేలు జరుగుతుందని అధికారులు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed