బోనాల జాతరకు భారీగా నిధులు రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్

by Satheesh |
బోనాల జాతరకు భారీగా నిధులు రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్
X

దిశ, సిటీ బ్యూరో: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఈ ఏటా బోనాల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి రూ.20 కోట్లను మంజూరు చేశారని కూడా ఆమె వెల్లడించారు. బోనాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు సీఎం అధ్యక్షతన రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటిని కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. మరికొన్ని రోజుల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని దేవాదాయ శాఖ కమిషనర్లతో మంత్రి శనివారం సెక్రటేరియట్‌లోని తన కార్యాలయంలో సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరిలోని ప్రధాన దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేశారని ప్రకటించారు.

దేవాలయాల అలంకరణ, పట్టు వస్త్రాలు కొనుగోలు, బోనాల సమాచారాన్ని తెలిపే పుస్తకాల ముద్రణ, అంబారీ నిమిత్తం ఏనుగు సేవల వినియోగం, విద్యుత్, సాంస్కృతిక, సమాచార ప్రజా సంబంధాల శాఖ ప్రచారం తదితర ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు ఆమె వివరించారు. దేవాదాయ శాఖ మంత్రి అయిన తాను, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యులుగా, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులు, కన్వీనర్‌గా మొత్తంగా ఏడుగురితో కూడిన కమిటి బోనాల ఉత్సవ నిర్వహణా బాధ్యతలను చేపడుతుందని మంత్రి తెలిపారు. ఇతర ప్రధాన దేవాలయాలకు ఉత్సవ కమిటీల ఎంపిక ప్రక్రియ రెండు, మూడు రోజుల్లో పూర్తవుతుందని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను చాటేలా బోనాలను నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు.

జోగినీల బోనాల సమర్పణ సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, వారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. బోనాల ఉత్సవాలను ప్రదర్శించేలా హోర్డింగ్‌లు, ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, బోనాల ఉత్సవాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రసారమాధ్యమాలైన దూరదర్శన్, యాదగరి ఛానల్‌లో లైవ్ ప్రసారాలు సాగేటట్లు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఏనుగు తరలింపుపై ఆరా తీశారు. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ భవన్‌లో తెలంగాణ ఖ్యాతి ఇనుమడించేలా ఉత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ పనుల నిమిత్తం అవసరమయ్యే నిధుల కేటాయింపుపై మంత్రి అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలే కేంద్రంగా ఈ ఏటా బోనాలను నిర్వహిస్తుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్లు కృష్ణవేణి, బాలాజీ, సంధ్యారాణి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed