T CLP: వరద బాధితులకు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రెండు నెలల జీతం విరాళం.. ఆ ఎమ్మెల్యే మాత్రం స్పెషల్

by Prasad Jukanti |   ( Updated:2024-09-08 09:28:00.0  )
T CLP: వరద బాధితులకు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రెండు నెలల జీతం విరాళం.. ఆ ఎమ్మెల్యే మాత్రం స్పెషల్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. కూడు, గూడు లేకుండా కట్టుబట్టలతో అనేక మంది నిరాశ్రయులుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చారు. ఈ మేరకు తమ రెండు నెలల జీతం విరాళంగా టీ సీఎల్పీ ప్రకటించింది. వీరితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ లు, ప్రభుత్వ సలహాదారులు సైతం తమ రెండు నెలల జీతాలను వరద బాధితుల సహాయార్థం ఇవ్వనున్నట్లు గాంధీ భవన్, కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం. దీనిపై పీసీసీ చీఫ్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

మరో అడుగు ముందుకేసిన జుక్కల్ ఎమ్మెల్యే:

వరద బాధితులకు సహాయం విషయంలో జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మరో అడుగు ముందుకు వేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయన ఒక నెల వేతనం విరాళంగా ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తన వంతుగా ఒక నెల జీతం రూ. 2,75,000 సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అందుకే తన వంతుగా నెల జీతం విరాళాన్ని సీఎంఆర్ఎఫ్ కు ప్రకటిస్తున్నాని తెలిపారు.

కాగా తెలంగాణలో ఎమ్మెల్యేలకు ప్రస్తుతం బేసిక్ శాలరీ రూ. 20 వేలు కాగా నియోజకవర్గం అలవెన్స్ కింద నెలకు రూ. 2.30 లక్షలు ఇస్తారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ తీసుకోనట్లయితే నెలకు రూ. 25 వేలు (కరెంటు, వాటర్ చార్జీలు ఫ్రీ - సొంత ఇల్లయినా... ఎమ్మెల్యే క్వార్టర్ అయినా...) ఇస్తారు. అసెంబ్లీ సెషన్‌కు హాజరయ్యే ఎమ్మెల్యేలకు (హైదరాబాద్ నుంచి 50 కి.మీ. దూరం దాటితే) రోజుకు వెయ్యి రూపాయల అలవెన్స్ కిందా ఇస్తారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతం బేసిక్ లో నుంచి ఇస్తారా లేక ఇతర అలవెన్సులు అన్నింటినీ కలుపుకుని విరాళంగా ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed