దేశంలో తెల్లరేషన్ కార్డుల సంఖ్య తగ్గాలి.. ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh N |
దేశంలో తెల్లరేషన్ కార్డుల సంఖ్య తగ్గాలి.. ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ దేశంలో తెల్లరేషన్ కార్డుల సంఖ్య తగ్గాలని, ఆరోగ్య శ్రీ కార్డుల సంఖ్య తగ్గాలని ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు వద్దు మేం బ్రతకగలం అనే స్థాయి ప్రజల్లో రావాలని, ఆ దిశగా ఎదగాలని ఆకాంక్షించారు. శుక్రవారం నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. పీఎం విశ్వకర్మ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లను ఈటల అందించారు.

ఈ సందర్భంగా సభలో ఎంపీ ఈటల మాట్లాడుతూ.. 77 ఏళ్ల తర్వాత కూడా ఈ దేశంలో పేదరికం, ఆకలి ఉందనే ప్రధాని నరేంద్ర మోడీ పీఎం విశ్వకర్మ లాంటి పథకాలను తీసుకువచ్చారన్నారు. ఆడపిల్లలు కూడా సమాజంలో సమానంగా ఎదుగుతున్నారని, తిండికి లేకపోయినా తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తున్నారని తెలిపారు. భారత్ యువశక్తి గల దేశం.. ఆ యువశక్తి పాన్ డబ్బాల దగ్గర ఉండకూడదు అని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ట్రైనింగ్ ఇప్పిస్తుందని, ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు.

నా తపన కూడా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్వయంశక్తి మీద బ్రతికేలా చేయడం.. అని చెప్పుకొచ్చారు. పేదలకు బ్యాంకులు షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలని అన్నారు. పెద్దలు బ్యాంకు రుణాలు ఎగ్గొడుతున్నారేమో కానీ మన మహిళా సంఘాలు మాత్రం 98 శాతం రీపేమెంట్ చేస్తున్నాయని వెల్లడించారు. నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న వారికి ఆర్థిక సాయం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. ప్రాచీన వృత్తులు కాపాడుకోవాలని, దీనికోసం తాను మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ఆరాటపడ్డారని చెప్పుకొచ్చారు. వృత్తి పనులు చేసే వారు సమాజం మేలు చేసేవారన్నారు. చేతి వృత్తుల వారు జీవితాలను త్యాగం చేసి మానవ కళ్యాణానికి తోడ్పడే వాళ్ళని, వారికి ఏం ఇచ్చినా తక్కువేనని అన్నారు. చేతి వృత్తుల వారి పట్ల మన మైండ్ సెట్ మారాలని, వారి పట్ల చిన్న చూపు తగదన్నారు. ఆపదలో ఉన్నవాడికి అవసరం ఉన్నవాడికి సహాయం చేసేవాడే నిజమైన మనిషి అని చెప్పారు.

Next Story

Most Viewed