మూసీ కూల్చివేతలపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Bhoopathi Nagaiah |
మూసీ కూల్చివేతలపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మూసీ పునరుజ్జీవనం పేరిట పరివాహక ప్రాంతాల్లో ఏండ్లకు ఏండ్లుగా నివసిస్తున్న పేదల ఇండ్లను కూలుస్తోందని, జేసీబీలకు అడ్డంగా పడుకుని అయినా ఇండ్లు కూల్చకుండా అడ్డుకుంటామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. జియాగూడ, లంగర్ హౌస్ మూసీ పరివాహక ప్రాంతాల్లో గురువారం ఆయన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులను నేరుగా కలిసి వారి సమస్యలను, డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. 50 ఏండ్ల నుంచి నివసిస్తున్న తమను రాష్ట్ర ప్రభుత్వం వెళ్లిపోవాలని హుకుం జారీ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని పేర్కొన్నారు. తమ చిరకాల స్వప్నమైన ఇండ్లను కట్టుకొని అప్పుల్లో ఉన్నామని బాధితులు వాపోతున్నారని, ప్రభుత్వం ఇక్కడున్న నిరుపేదలకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో స్థలాలు కేటాయించిన తర్వాత పేదల ఇండ్లను కూల్చాలని ఏలేటి డిమాండ్ చేశారు. పేదలకు అండగా బీజేపీ ఉంటుందని భరోసా కల్పించారు. పేదల సమస్యలు పరిష్కరించకుండా ఇండ్లు కూలగొడతామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ ప్రాణాలు అడ్డుగా పెట్టి అయినా కూల్చివేతలను ఆపుతామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed