పదేళ్లుగా నెవీరాడార్​ ను అడ్డుకున్నాం : మహేశ్​ రెడ్డి

by Sridhar Babu |
పదేళ్లుగా నెవీరాడార్​ ను అడ్డుకున్నాం : మహేశ్​ రెడ్డి
X

దిశ, పరిగి : పదేళ్లుగా బీఆర్​ఎస్​ పాలనలో దామగుండంలో నెవీరాడార్​ ప్రాజెక్టు రాకుండా అడ్డుకున్నామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి అన్నారు. పరిగి డివిజన్​ పూడూరు మండలం దామగుండం ఆలయ ప్రాంగణంలో ఆదివారం దామగుండం పరిగి రక్షణ చమితి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ పండుగ నిర్వహించారు. సేవ్​ దామగుండ, దామగుండం సల్లంగుండాలే, నెవీ వద్దు అడవి ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున బతుకమ్మ ఆట ఆడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి మాట్లాడుతూ నెవీరాడార్​ ప్రాజెక్టు వస్తే అడవితోపాటు వన్యప్రాణులకు నష్టం వాటిల్లుతుందని బీఆర్​ఎస్​ హయాంలో అడ్డుకుంటూ వచ్చామన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెవీరాడార్​ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చి శంకుస్థాపనలకు రంగం సిద్దం చేస్తుందన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ దేశ రక్షణ ముఖ్యమేకానీ ఇంత పెద్ద అడవిని నరకడం సమంజసం కాదన్నారు. లక్షల చెట్లతో వెలకట్టలేని ఆక్సిజన్​ ను మనకు అందజేస్తుందన్నారు. మనమంతా నెవీరాడార్​ రాకుండా అడ్డుకుందామన్నారు. ఇందు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకైనా వెనకాడేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్​ నాయకులు కొప్పుల అనిల్​ రెడ్డి, బీఆర్​ఎస్​ నాయకులు, మాజీ ఎంపీపీ మల్లేషం, ఎదిరె కృష్ణ, దామగుండం పరిరక్షణ సమితి అధ్యక్షుడు వెంకటయ్య, సునంద, స్థానికులు, కళాకారులు, ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story