దిశ ఎఫెక్ట్.. శివ సాగర్ ప్రాజెక్టును కాపాడుతామన్న కలెక్టర్

by Nagam Mallesh |
దిశ ఎఫెక్ట్.. శివ సాగర్ ప్రాజెక్టును కాపాడుతామన్న కలెక్టర్
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : గత బుధవారం 28వ తేదీన దిశ దినపత్రికలో వచ్చిన "శివరెడ్డి పేట్ చెరువు చుట్టూ ఆక్రమణలే.. శివరెడ్డి పేట్ చెరువులో డ్రైనేజీ నీరు కలుస్తుంది" అనే వార్త కథనానికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పందించారు. ఈ సందర్భంగా శివ సాగర్ ప్రాజెక్టులోకి మురుగునీరు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివ సాగర్ ప్రాజెక్ట్ అనుసంధాన కాలువను, మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న సమీకృత మార్కెటు దుకాణాల సముదాయాన్ని, మార్కెట్ యార్డులోని పనులు, కొత్రేపల్లి కాలువను స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, కమిషనర్ జాకీర్ అహమ్మద్, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ప్రజల నిత్య అవసరాలకు వికారాబాద్ మునిసిపాలిటీకి త్రాగునీరు అందించే శివ సాగర్ ప్రాజెక్టులోకి మురుగు నీరు చేరి కలుషితం కాకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగి భావితరాలకు ఎంతగానో ఉపయోగపడే ఇట్టి ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. అలాగే పూడూరు మండల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లోని గ్రామాల నుండి వచ్చే మురుగు నీరు ప్రాజెక్టు లోకి రావడం వల్ల జరిగే ప్రమాదాన్ని గుర్తించిన కలెక్టర్ మురుగు నీటిని కాలువల ద్వారా మళ్లించేందుకు చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుందర్ ను ఆదేశించారు. ప్రాజెక్టులో పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్తాచెదారాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు సూచించారు. మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న సమీకృత మార్కెటును సందర్శించిన కలెక్టర్, సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన చేపట్టి చిరు వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed