మహిళ హత్య కేసులో పురోగతి..

by Sumithra |
మహిళ హత్య కేసులో పురోగతి..
X

దిశ, బడంగ్ పేట్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహాడిషరీఫ్​ సంచిలో లభ్యమయిన మహిళ హత్య కేసులో పహడీషరీఫ్​ పోలీసులు పురోగతిని సాధించారు. హత్యకు గురైన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడమే గాకుండా ఆమెకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని వేధించిన ప్రియుడిని బ్లాక్​ మెయిల్​ చేయడంతో హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వివరాలలోకి వెళితే రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్ సర్దార్ పటేల్ నగర్ ప్రధాన రహదారి పై పడిఉన్న సంచి నుంచి భరించలేని దుర్వాసన వ్యాపిస్తుందని ఈ నెల 12వ తేదీన తెల్లవారుజామున స్థానికులు డయల్ 100 ద్వారా పహాడీ షరీఫ్ పోలీసులు సమాచారం అందుకున్నారు.

ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు సంచిని విప్పి చూడగా 40 నుంచి 45 సంవత్సరాల మహిళ మృతదేహాం లభ్యమయ్యింది. మృతదేహంతో పాటు ఎరుపు రంగు చీర, పసుపు రంగు జాకెట్​, చాక్​ లెట్​ రంగు లంగ, మెడలో పసుపు కలర్​ తాడు, చేతులకు ఉంగరాలు, బ్లాక్​ ఆండ్​ రెడ్​ కలర్​ చెప్పులు మూటలో లభించాయి. అంతేగాకుండా మెడకు టవల్ తో ఉరిభిగించడంతో నాలిక బయటికి రావడం, శరీరం ఉబ్బిపోయి కనిపించాయి. దీంతో సదరు మహిళను అప్పటికే హత్య చేసి మూడు రోజులు అయిఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు శవంతో పాటు లభ్యమయిన వస్తువులను మీడియా ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారు.

యాచారంకు సంబంధించిన మరో మహిళ ద్వారా హత్యకు గురయ్యింది సైదమ్మ అని గుర్తించినట్లుగా విశ్వసనీయ సమాచారం. సూర్యపేట్​కు చెందిన సైదమ్మ కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. బడంగ్​పేట్​లోని ఎంసీఆర్​ కాలనీలో గత కొన్నేళ్ల క్రితం వలస వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన రియల్​ఎస్టేట్​ వ్యాపారి పెద్దబావి శ్రీనివాస్​ రెడ్డికి సైదమ్మతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారిదీసింది. ఈ నేపధ్యంలో శ్రీనివాస్​ రెడ్డి సైదమ్మ కు గతంలో కొన్ని డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. తిరిగి శ్రీనివాస్​ రెడ్డి డబ్బులు అడగడంతో లలిత బ్లాక్​ మెయిల్​కు పాల్పడడంతో హతమార్చినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed