BJP vs BRS.. BL సంతోష్ వ్యాఖ్యలతో మరింత ముదిరిన వివాదం

by GSrikanth |   ( Updated:2022-12-31 02:30:24.0  )
BJP vs BRS.. BL సంతోష్ వ్యాఖ్యలతో మరింత ముదిరిన వివాదం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య యుద్ధం ముదిరింది. పరస్పర విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే ఈడీ రెయిడ్స్ తో బీఆర్ఎస్ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ తరుణంలో బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పార్లమెంట్ విస్తారక్ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆయన మొయినాబాద్ ఫాంహౌజ్ విషయంలో మాట్లాడారు. ఇక సమరం తప్పదని హెచ్చరించారు. దీంతో బీఆర్ఎస్ టెన్షన్ పెరిగింది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. జాయినింగ్స్ పై ప్రధానంగా దృష్టి సారించింది. ఇదే సమయంలో నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని బీఆర్ఎస్ ఆరోపించింది. అందులో బీఎల్ సంతోష్ పేరును చేర్చింది. ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఈ వ్యవహారంపై ఎన్నడూ స్పందించని బీఎల్ సంతోష్ ఉన్నట్టుండి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలన్నారు. దీంతో భవిష్యత్ లో బీఆర్ఎస్ కు చుక్కలు తప్పవా అనే అనుమానం రాజకీయ వర్గాల్లో నెలకొన్నది.

నెక్స్ట్ ఏమిటో..!

తెలంగాణలో తానెవరో ఎవరికీ తెలియదన్న బీఎల్ సంతోష్ తన పేరును ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేశారని, ప్రజాస్వామ్యానికి బీఆర్ఎస్ నేతలు శాపంగా మారారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ తల్లి అని చెప్పి ఆమెకే ద్రోహం చేశారని కామెంట్స్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యల వెనుకు ఉన్న మతలబేంటో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఇప్పటికే బిక్కుబిక్కుమని గడుపుతున్న బీఆర్ఎస్ నేతలు భవిష్యత్ లో ఇంకెలాంటి ఘటనలు ఎదుర్కోవాలోనని టెన్షన్ లో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనిది బీఎల్ సంతోష్ ఈ అంశాన్ని ఇంత సీరియస్ గా తీసుకున్నారంటే బీఆర్ఎస్ లో తర్వాత జరగబోయే పరిణామాలేమిటనేది ఆసక్తికరంగా మారింది. కానీ బీఆర్ఎస్ నేతలకు మాత్రం ఆయన కామెంట్స్ నిద్ర లేకుండా చేశాయన్నది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇది వారికి ఏమాత్రం మింగుడుపడటం లేదని సమాచారం. మరి దీనిని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందనేది వేచిచూడాల్సిందే.

Also Read..

BRS విస్తరణ ప్లాన్‌పై మొదలైన కసరత్తు.. వాటిపై డైలమా!

Advertisement

Next Story

Most Viewed