కోర్టులో బయటపడ్డ నిజాలు.. ఇద్దరిని జైలుకు పంపించిన జడ్జి

by Kavitha |
కోర్టులో బయటపడ్డ నిజాలు.. ఇద్దరిని జైలుకు పంపించిన జడ్జి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: విధులు నిర్వహిస్తున్న అధికారులను దూషించడమే కాకుండా, చేయి చేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు నిందితులు మహమ్మద్ మునావర్, మహ్మద్ అఖ్లాక్ అహ్మద్‌లకు జైలు శిక్ష విధిస్తు నిజామాబాద్ రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పాముజుల శ్రీనివాస్ రావు శుక్రవారం తీర్పు వెలువరించారు.

నిజామాబాద్ నగరం ఆటోనగర్ లోని తెలంగాణ సూపర్ మార్కెట్ పురానీ హవేలీ వద్ద నవంబర్ 14, 2018 రోజున పోలీస్ కానిస్టేబుల్ సయ్యద్ హమీద్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు. ఇది గమనించిన ఆటోనగర్‌కు చెందిన మహ్మద్ మునవర్ నువ్వెవరు.. ఇక్కడేం చేస్తున్నావంటూ దురుసుగా ప్రశ్నించాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ పై మునావర్ దుర్భాషలాడటమే కాకుండా చేయి చేసుకున్నాడనే నేరారోపణలు కోర్టులో న్యాయ విచారణలో రుజువు కావడంతో నిందితుడు మునావర్‌కు ఒక సంవత్సరం సాధారణ జైలుశిక్ష, రూ. రెండు వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా రెండు వారాలు జైలు శిక్ష అనుభవించాలని జడ్జి శ్రీనివాస్ రావు తీర్పులో పేర్కొన్నారు.

మరో కేసులో డిసెంబర్ 24, 2018 న నగరంలోని అర్సపల్లి శివారులో ప్రభుత్వ భూమిని ఆక్రమించి గుడిసెలు వేస్తున్నరనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన నిజామాబాద్ మండల తహశీల్దార్ కార్యాలయ రెవెన్యూ సిబ్బందిని మహ్మద్ అఖ్లాక్ అహ్మద్ అనే వ్యక్తి అడ్డుకోవడమే కాకుండా, వీఆర్ఓ గాజుల చిన్న నారాయణను దూషిస్తూ కట్టెతో దాడి చేసాడనే అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువయ్యాయి. దీంతో నిందితుడు ధర్మపురి హిల్స్ నివాసుడైన మహమ్మద్ అఖ్లాక్ అహ్మద్‌కు ఏడాదిన్నర సాధారణ జైలుశిక్షతో పాటు రూ. రెండు వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శ్రీనివాస్ రావు పదిహేను పేజీల తీర్పు వెలువరించారు. కాగా నిజామాబాద్ నగర ఆరవ టౌన్ పోలీసుల తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భూసారపు రాజేష్ గౌడ్ కోర్టులో వాదించారు. ప్రాసిక్యూటర్‌కు ఆరవ టౌన్ కానిస్టేబుల్ గజానంద్ జాదవ్ సహాయకారిగా నిలిచారు.

Advertisement

Next Story