Union Minister Giriraj Singh : చేనేత పరిశ్రమను ఆదుకోండి..

by Sumithra |
Union Minister Giriraj Singh : చేనేత పరిశ్రమను ఆదుకోండి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : చాలా కాలంగా పెండింగులో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ని తెలంగాణలో స్థాపించాలని, కేంద్ర జౌళి, టెక్స్ టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కోరారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో గురువారం కలిసి విజ్ఞాపన పత్రాన్ని మంత్రికి సమర్పించారు. అర్వింద్ వెంట రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి కూడా ఉన్నారు. చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను శ్రావణి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఇక్కత్ డిజైన్లకు ప్రసిద్ధి అని, మార్కెట్లో అసలైన ఫ్యూర్ ఇక్కత్ చీరలు రూ. 8 వేలు ధర పలుకుతుందని, కానీ ప్రింటెడ్ ఇక్కత్ చీరలు కేవలం రూ. 300 లకే లభించడంతో పరిశ్రమ కుదేలవుతున్నట్లు భోగ శ్రావణి కేంద్ర మంత్రికి వివరించారు. చేనేత కార్మికుల జీవనోపాధి మీద ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి నేతన్నలకు భరోసా కల్పించడానికి ప్రింటెడ్ చీరల ఉత్పత్తి, విక్రయాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె మంత్రిని కోరారు.

చేనేత ఉత్పత్తుల పై జీఎస్టీ విధించినప్పటి నుండి నేతన్నలు అదనపు ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్నారని, కాబట్టి చేనేత ఉత్పత్తుల పై జీఎస్టీని తొలగించాలని ఆమె మంత్రిని కోరారు. అదేవిధంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇక్కత్ కళకు, గద్వాల్ చీరలకు, వరంగల్ దుర్రీలను ఉత్పత్తి చేసే అసాధారణ కళ తెలంగాణ నేతన్నల సొంతమని ఆమె వివరించారు. కాబట్టి తెలంగాణలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. అనంతరం బోగ శ్రావణి పోచంపల్లి శాలువాతో మంత్రిని సన్మానించగా, ఆయన ఆసక్తిగా గమనిస్తూ, తెలంగాణ వచ్చినప్పుడు తప్పకుండా పోచంపల్లిని సందర్శిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా విన్నపాల మీద తగు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతన్నల తరపు నుండి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed