8 మంది పై దాడిచేసిన పిచ్చి కుక్క..

by Sumithra |
8 మంది పై దాడిచేసిన పిచ్చి కుక్క..
X

దిశ, భిక్కనూరు : సైలెంట్ గా వచ్చి... వాసన చూస్తూ.. 8 మందిని కుక్క కరిచి తీవ్రంగా గాయపరిచిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే 44వ హైవే పై నుంచి వస్తున్న పిచ్చికుక్క జంగంపల్లి, అంతంపల్లి, టోల్ ప్లాజా వద్ద రోడ్డు పై నడుచుకుంటూ వస్తున్న వారిని ముగ్గురిని కరువగా... టోల్ ప్లాజా నుంచి కలెక్టర్ రోడ్డు ద్వారా వ్యవసాయ పనులకు వెళ్తున్న మహిళలను కరిచింది. అలాగే ఊర్లోకి వచ్చిన పిచ్చికుక్క కల్లు సీసాలు తీసుకొస్తున్న గొల్లపల్లి వినోద్ గౌడ్ అతని సోదరుడు నాగరాజుగౌడ్, అంతకుముందే వ్యవసాయ పనులకు వెళ్తున్న నాగర్తి రాధవ్వ, సందు గారి లలిత, పైతరి సుశీలను కరిచింది.

కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన వారు కల్లు సీసాతో పిచ్చికుక్క పై దాడి చేసినప్పటికీ కుక్క తప్పించుకొని పారిపోయింది. ఈ హఠాత్పరిణామంతో బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు ఆ కుక్క కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రంగా గాయపడిన వారంతా చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా ఒక్కొక్కరికి 12 నుంచి 14 కుట్లు వరకు పడ్డాయి. ప్రస్తుతం బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Next Story