Narender Reddy: సంతకం పెట్టాలని కేసీఆర్ నాపై ఒత్తిడి చేశారు

by Gantepaka Srikanth |
Narender Reddy: సంతకం పెట్టాలని కేసీఆర్ నాపై ఒత్తిడి చేశారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు తనపైన ఒత్తిడి తీసుకొచ్చారని రాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నరేందర్‌రెడ్డి ఆరోపించారు. తొందరగా అప్రూవల్ కావాలన్న షరతుతో తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా సంతకాలు చేయించుకున్నారని అన్నారు. డిజైన్లలో హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన అంశాలతో తనకు సంబంధం లేదని చెప్పినా ఉన్నతస్థాయిలో తాము ఆథెంటికేట్ చేస్తున్నాం గదా... అని నొక్కిచెప్పి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని అన్నారు. ఒక దశలో సంతకం ఎందుకు చేయడంలేదు... ఏం ఇబ్బంది ఉన్నది... అంటూ ప్రశ్నించారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నిర్వహిస్తున్న బహిరంగ విచారణకు గురువారం హాజరైన ఆయన జస్టిస్ పీసీ ఘోష్ ముందు స్టేట్‌మెంట్ నమోదు చేశారు. కేంద్ర జల సంఘం ఆమోదం తర్వాత కూడా డిజైన్లలో మార్పులు జరిగాయన్నారు.

డిజైన్‌కు సంబంధించిన వ్యవహారాలకు మాత్రమే తాను జవాబుదారీ అని, కానీ హైడ్రాలజీ, ఇన్వెస్టేగేషన్‌కు సంబంధించిన అంశాలపై కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ దగ్గర సైతం ఈ అంశాన్ని ప్రస్తావించానని నరేందర్‌రెడ్డి గుర్తుచేశారు. చెక్‌లిస్టుకు సంబంధించిన అంశాల్లోనూ ఇదే ఇబ్బంది ఎదురైందన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ లేవనెత్తిన ప్రశ్నకు నరేందర్‌రెడ్డి బదులిస్తూ... దీని డిజైన్లను 2017 మార్చి 29న రిలీజ్ చేశామన్నారు. ఈ బ్యారేజీకి సంబంధించిన ప్రతీ కాంపొనెంట్ డిజైన్‌లో ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. సీడీఓ సీఈ (అప్పట్లో చీఫ్ ఇంజినీర్)గా తాను రూపొందించిన ప్రతీ డిజైన్‌లో ఎల్ అండ్ టీ సంస్థ ఇన్వాల్వ్ అయిందని సమాంతర డిజైన్లను ఇచ్చిందన్నారు. కానీ ఆ తర్వాత మాత్రం తనకు ఏం సంబంధం లేదంటూ తప్పుకున్నదని, పూర్తి బాధ్యత సీడీఓదే అంటూ మాట మార్చిందన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ ఖరారు కావడానికి ముందు వివిధ అంశాలపై రూపొందించిన చెక్ లిస్టు విషయంలోనూ 2017 ఫిబ్రవరి 21న తయారుచేసిన లెటర్‌లో తిరకాసు ఉన్నదన్నారు. చివరకు సీడీఓ పేరుతో డిజైన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వచ్చిందని, కానీ ఆ తర్వాత ఆ లెటర్‌లో కొన్ని పదాలను తొలగించినట్లు గుర్తించానని, సమాచార హక్కు చట్టం ద్వారా ఒరిజినల్ లెటర్‌ను తెప్పించుకోవాల్సి వచ్చిందని నరేందర్‌రెడ్డి కమిషన్‌కు వివరించి ఆ ఆర్టీఐ రిప్లై కాపీని అందజేశారు. ఉద్దేశపూర్వకంగా పై స్థాయిలో ఉన్న పెద్దలు (అప్పటి సీఎం, ఇరిగేషన్ మంత్రి) సేఫ్ జోన్‌లోకి వెళ్ళేలా ఈ పదాలను డిలీట్ చేశారని కమిషన్‌కు స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి సీఎం, ఇరిగేషన్ మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశాలు పెట్టుకున్నా ఎన్నడూ తనను ఆహ్వానించలేదని, ఆ మీటింగులకు తాను హాజరుకాలేదన్నారు. కేవలం బ్యారేజీలు కట్టే లొకేషన్లను మాత్రమే తనకు పంపి డిజైన్లు రూపొందించాల్సిందిగా ఆదేశించారన్నారు.

ఎవరి నిర్ణయం మేరకు మేడిగడ్డ లొకేషన్ ఖరారైందో తనకు తెలియదని, కాంట్రాక్టు సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం (అగ్రిమెంట్) కాపీ కూడా తాను రిటైర్ అయ్యే సమయం వరకూ ఇవ్వలేదన్నారు. బ్యారేజీల నిర్మాణం సమయంలోనే లోపాలు, తప్పిదాలు జరిగాయని, కేంద్ర జల సంఘానికి అప్రూవల్ కోసం డీపీఆర్ పంపి ఆమోదంతో తిరిగొచ్చిన తర్వాత కూడా కొన్ని మార్పులు జరిగాయన్నారు. డిజైన్‌కు తగినట్లుగా నిర్మాణం జరుగుతున్నదో లేదో తనిఖీ చేసే సంప్రదాయం గత ప్రభుత్వంలో కొరవడిందని, అందువల్లనే తాను వెళ్ళలేదన్నారు. నిర్మాణం ప్రారంభం కావడానికి ముందే మేడిగడ్డ సైట్‌ను చూశాను తప్ప ఆ తర్వాత విజిట్ చేయలేదన్నారు. నిర్మాణం తర్వాత బ్యారేజీ నిర్వహణలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకున్నదని, కనీస స్థాయిలో జరగాల్సిన మెయింటెనెన్స్ కూడా లేదన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ అయిన తర్వాత చక్కదిద్దడానికి అవకాశం ఉన్నా పట్టించుకోలేదని కమిషన్‌కు నరేందర్‌రెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చారు. డిజైన్ విషయంలో సీడీఓ సీఈగా తనపైన అప్పటి సీఎం, ఇరిగేషన్ మంత్రులు ఎలా ఒత్తిడి తీసుకొచ్చారో నిర్మాణం విషయంలోనూ అదే తరహా హడావిడి చేశారని అన్నారు. డ్యామ్‌తో పోలిస్తే బ్యారేజీలకు కొన్ని పరిమితులు, అనుకూలతలు ఉంటాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్‌గా, పీరియాడికల్‌గా జరగాల్సిన తనిఖీలు, దిద్దుబాటు చర్యలు, మెయింటెనెన్స్ తదితరాలను చేపట్టాల్సి ఉన్నదని, కానీ కనీసమైన ప్రాధాన్యత కూడా ఇవ్వలేదన్నారు. రాత్రింబవళ్ళు ఫ్లడ్ లైట్లలో పనులు జరిగాయని, ఇలాంటి హడావిడితోనే క్వాలిటీ కంట్రోల్ చెక్ సరిగా జరగలేదని, గేట్ల ఆపరేషన్ సైతం ఆశించినట్లుగా లేదని, బ్యారేజీల నిర్వహణ సైతం లోపభూయిష్టంగా ఉన్నదన్నారు.

నిజానికి బ్యారేజీలకు డిజైన్, డ్రాయింగ్ రూపొందించిన తర్వాత వాటికి తగినట్లుగానే నిర్మాణం జరుగుతున్నదో లేదో చూడాల్సిన బాధ్యత సీడీఓ చీఫ్ ఇంజినీర్ బాధ్యత అయినా తనకు ఎలాంటి రోల్ లేకుండా పోయిందని, తనిఖీలు చేసే అవకాశం గత ప్రభుత్వంలో లేకుండా పోయిందన్నారు. రాఫ్ట్ (పునాది), ఆప్రాన్స్, పైల్స్, పిల్లర్లు, రేడియల్ గేట్లు.. లాంటి ప్రమాణాలను కొలతలతో సహా డిజైన్‌, డ్రాయింగ్‌లలో పొందుపర్చడం తన బాధ్యత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదనలు, కాన్సెప్ట్ బాధ్యులెవరో తనకు తెలియదన్నారు. ఏనాడూ ఆ చర్చల్లో, సమావేశాల్లో తాను హాజరు కాకపోవడంతో తనకు స్పష్టత లేదన్నారు. డిజైన్, డ్రాయింగ్‌లలో భాగంగా 2-డి డిజైన్లను రూపొందించామన్నారు. 3-డీ మోడల్ స్టడీస్ పూర్తయిన తర్వాత డిజైన్లు రూపొందించాల్సి ఉన్నా అప్పటి సీఎం, మంత్రి ఒత్తిడి కారణంగా కాలేదన్నారు.

రేడియల్ గేట్లను మెకానికల్‌గా ఆపరేట్ చేయడం, షూటింగ్ వెలాసిటీ, బెడ్ లెవల్, రాఫ్ట్ కు పైల్ క్యాప్‌కు మధ్య ఫ్లెక్సిబిలిటీ తదితర అంశాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), సీబీఐపీ మాన్యువల్స్ లోని ప్రమాణాలకు అనుగుణంగానే డిజైన్లు, డ్రాయింగ్ రూపొందింనట్లు నరేందర్‌రెడ్డి తెలిపారు. కమిషన్ హెడ్‌గా జస్టిస్ పీసీ ఘోష్ లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేశారు. మరికొన్నింటిని నాట్ అగ్రీడ్, ఐ డోన్డ్ నో... అంటూ రిప్లై ఇచ్చారు. తొలుత రూపొందించుకున్న పారామీటర్స్ కు వాస్తవిక డిజైన్‌కు మధ్య ఎలాంటి తేడాలు లేవని స్పష్టం చేశారు. తాము రూపొందించిన డిజైన్లు, డ్రాయింగ్‌లను ఒక అథారిటీగా తెలంగాణ ఇంజినీరింగ్ రీసెర్చి లేబొరేటరీ ధృవీకరించిందని, కానీ నిర్మాణం సమయంలో ఎల్ అండ్ టీ సంస్థ పాటించలేదన్నారు.


Next Story

Most Viewed