ఆయిల్ పామ్ సాగుకు సహకారం అందించాలని మలేషియాను కోరిన మంత్రి తుమ్మల

by Mahesh |
ఆయిల్ పామ్ సాగుకు సహకారం అందించాలని మలేషియాను కోరిన మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆయిల్ పామ్ సాగు పై మెళకువలు తెలుసుకునేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తో పాటు అధికారుల బృందం మాలేషియా పర్యాటనకు వెళ్లారు. పర్యటనలో భాగంగా బుధవారం మలేషియా ప్లాంటేషన్, కమోడిటీస్ మంత్రి జోహరి అబ్దుల్ ఘనితో భేటీ అయ్యారు. ఆయిల్ పామ్ విస్తరణ అవకాశాలు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వహణ, సాగులో అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు, ఆయిల్ పామ్ ఉత్పాదకాలపై చర్చించారు. తెలంగాణ ఆయిల్ పామ్ సాగు కోసం అందిస్తున్న ప్రోత్సాహకాలు, రానున్న రోజుల్లో ఆయిల్ పామ్ పరిశ్రమ అభివృద్ధికి గల అవకాశాలు వివరించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగులో అగ్రగామి దేశాలలో ఒకటిగా ఉన్న మలేషియా నుంచి సహకారం అందించగలరని కోరారు. మలేషియా మంత్రి జోహరి అబ్దుల్ ఘని మాట్లాడుతూ, 143 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఆహారం అందించడం గొప్ప విషయమన్నారు. ప్రపంచ దేశాలు అన్నీ భారత్ లో అవలంబిస్తున్న విధివిధానాలను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పామ్ ఆయిల్ వృద్దికి తాము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఆ దిశలో త్వరలోనే వారి బృందం తెలంగాణ లో పర్యటిస్తారని తెలిపారు.

అనంతరం మంత్రి ఓఈ(ఎంఏటీఆర్ఏఓఈ)చైర్మన్ డాటో సెరి రీజల్ మెరికన్ తో భేటీ అయ్యారు. వ్యవసాయ పరంగా వ్యాపార అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇండియాతో వ్యాపారాభివృద్ధికి తమ దేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బ్రోకెన్ రైస్ కు మలేషియాలో అత్యంత డిమాండ్ ఉందన్నారు. మంత్రి తుమ్మల స్పందించి హాకా ఏండీ చంద్రశేఖర్ రెడ్డిని ఫోన్ లో సంప్రదించి రాష్ట్రం నుంచి బ్రోకెన్ రైస్ ఎగుమతి, దానికి సంబంధించిన ఎకానమిని పరిశీలించి, వరి రైతులకు అదనపు ప్రయోజనం కలిగితే, వచ్చే యాసంగి కల్లా ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మలేషియా పామ్ ఆయిల్ బోర్డును సందర్శించి, పామ్ ఆయిల్ రంగంలో వాళ్ళ అనుభవాలను ఎంపీఓబీ చైర్మన్ అహ్మద్ పర్వేజ్ గులామ్ ఖాదీర్ తో పంచుకున్నారు. ఎంపీఓబీ, ఆయిల్ పామ్ సాగులో ఒక నూతన ఒరవడిని సృష్టించిందని, అంతేగాక ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే ప్రాంతాలలో పంట విస్తరణకు కావాల్సిన సాంకేతిక సహాయం అందిస్తుందని మంత్రికి తెలిపారు. బృందంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానశాఖ డైరెక్టర్, ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed