Priyanka Gandhi : ‘వయనాడ్’ బైపోల్.. ప్రియాంకాగాంధీ స్థిరాస్తులు, చరాస్తులివీ

by Hajipasha |
Priyanka Gandhi : ‘వయనాడ్’ బైపోల్.. ప్రియాంకాగాంధీ స్థిరాస్తులు, చరాస్తులివీ
X

దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తనకు రూ.12 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆమె వెల్లడించారు. వీటిలో రూ. 4.24 కోట్లు విలువైన చరాస్తులు ఉన్నాయని తెలిపారు. తన భర్త రాబర్ట్ వాద్రా హోండా సీఆర్‌వీ కారును బహుమతిగా ఇచ్చారని చెప్పారు. రూ. 1.15 కోట్లు విలువ చేసే 4400 గ్రాముల బంగారం ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రియాంక తనకు రూ. 7.74 కోట్లు విలువైన స్థిరాసులు ఉన్నాయని వెల్లడించారు. న్యూఢిల్లీకి చెందిన మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న ఒక వ్యవసాయ భూమి, అందులోని ఫామ్ హౌస్ భవనాల్లో చెరి సగం వాటా తనకు వారసత్వ ఆస్తిగా లభించిందని ఆమె తెలిపారు.వాటి విలువ రూ. 2.10 కోట్లు ఉంటుందన్నారు.

రూ.15.75 లక్షల అప్పులు

హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో తన కష్టార్జితంతో ఇల్లు నిర్మించుకున్నానని, దాని విలువ రూ. 5.63 కోట్లు అని ప్రియాంక చెప్పారు. తనకు రూ. 15.75 లక్షల అప్పులున్నట్లు ఆమె పేర్కొన్నారు. 2012-13 సంవత్సరానికి ఆదాయపు పన్ను శాఖ రీఅసెస్‌మెంట్ ప్రొసీడింగ్స్‌ను తాను ఎదుర్కొంటున్నానని, దీని ప్రకారం తాను రూ. 15 లక్షలను పన్నులుగా చెల్లించాల్సి ఉందన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తన పూర్తి ఆదాయాన్ని రూ. 46.39 కోట్లుగా నామినేషన్ పత్రాలలో ప్రియాంక ప్రస్తావించారు. ఇళ్ల అద్దెలతో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై వచ్చే వడ్డీ రూపంలో తనకు ఆదాయం సమకూరిందన్నారు.

రాబర్ట్ వాద్రా ఆస్తులు.. ప్రియాంక విద్యార్హతలు

తన భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను కూడా ప్రియాంక తన అఫిడవిట్‌లో పొందుపరిచారు. రాబర్ట్ వాద్రాకు రూ. 37.9 కోట్లు విలువైన చరాస్తులు, రూ. 27.64 కోట్లు విలువైన స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. తనపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు, ఒక అటవీ శాఖ నోటీసు ఉన్నట్లు ఆమె ప్రకటించారు. తప్పుదారి పట్టించే ట్వీట్లు చేసినట్లు ఒక వ్యక్తి చేసిన ఆరోపణల ఆధారంగా మధ్యప్రదేశ్‌లో తనపై చీటింగ్, ఫోర్జరీ సెక్షన్ల కింద 2023లో ఒక ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు అఫిడవిట్‌లో ప్రియాంక పేర్కొన్నారు. 2020లో హత్రాస్ ఘటనకు నిరసనగా తాను నిరసన తెలిపినందుకు ఉత్తరప్రదేశ్‌లో కేసు నమోదైనట్లు చెప్పారు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సండర్‌ల్యాండ్ నుంచి దూరవిద్య ద్వారా పీజీ డిప్లొమా ఇన్ బుద్ధిస్ట్ స్టడీస్, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో బీఏ హానర్స్ డిగ్రీని చేసినట్లు ప్రియాంక తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed