Minister Ponguleti : ప్రమాదం అనేది చెప్పి రాదు మంత్రి..

by Sumithra |
Minister Ponguleti : ప్రమాదం అనేది చెప్పి రాదు మంత్రి..
X

దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలం వద్ద గోదావరి 55 అడుగులకు వచ్చే అవకాశం ఉన్నందున ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు సబ్ కలెక్టర్ రేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గోదావరి వరదల సమయంలో తీసుకోవలసిన తగు జాగ్రత్తల పై భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీవో బి. రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఏఎస్పీ అంకిత్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం అనేది చెప్పి రాదని నిరంతరంగా వర్షాలు కురవడం వల్ల గోదావరికి పైన ఉన్నటువంటి నదుల నుంచి వరద ప్రభావం పెరిగిందని, ప్రవాహానికి తగినట్లుగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సన్నద్ధతో ఉన్నట్లు ఆయన అన్నారు. అధికార యంత్రాంగం 24 గంటలు నిరంతర సేవలో నిమగ్నమై ఉన్నట్లు ఆయన వివరించారు.

ప్రజల సంరక్షణ బాధ్యత, నిబద్ధత ప్రభుత్వం పై ఉందని ఆ ప్రకారమే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం వచ్చిన వరదల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విస్తా కాంప్లెక్స్ వద్ద స్లూయిస్ మరమ్మత్తులు నిర్వహించి మోటార్లు ఏర్పాటు ద్వారా ఎప్పటికప్పుడు మురుగునీరు తొలగిస్తున్నామని అన్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడానికి మహిళా సమాఖ్య సభ్యుల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, అలాగే వరద ముంపునకు గురి అయ్యే గ్రామాలకు వైద్యం సౌకర్యం పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అత్యవసర మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని, అన్ని గ్రామాల్లో సురక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నామని విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూస్తున్నామని ఆయన అన్నారు. వరద ప్రభావిత సమస్య, ముంపు గ్రామాలు 111 ఉన్నాయని, ఆ గ్రామాలను ఏడు సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్లో మొబైల్ బృందాలు పర్యవేక్షణ జరిగేలా ఏర్పాట్లు చేశామని అన్నారు.

పునరావాస కేంద్రాల్లో ఉండే ప్రజలకు ఆరోగ్యంతో పాటు పౌష్టికరమైన ఆహారం, మంచినీరు, శానిటేషన్ పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పునరావాస కేంద్రానికి ప్రజలను తరలించడానికి ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పించామని, వరద బాధితుల నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో మురుగునీరు నిలువ ఉన్నచోట క్లోరినేషన్, బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, అలాగే దోమలు ప్రబలకుండా వైద్య శాఖ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఏఎన్ఎం, ఆశ వర్కర్లు తప్పనిసరిగా ఉండే విధంగా చూడాలని, గర్భిణీ స్త్రీలను దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు.

అలాగే పాఠశాలల్లో విద్యార్థుల చదువు పాడు కాకుండా టీచర్లు ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఈవోకు ఆదేశించారు. శానిటేషన్ పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ముంపునకు గురిఅయ్యే గ్రామాలలోని ప్రజలకు పునరావాస కేంద్రాల్లో అందించే ఆహారాన్ని తప్పనిసరిగా జిల్లా కలెక్టర్, పీఓ, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు తనిఖీ చేస్తూ ఉండాలని అన్నారు. వరద తాకిడికి రోడ్లపై వరద నీరు ప్రవహిస్తే ప్రజలు దాటకుండా చూడాలని అక్కడ తప్పనిసరిగా పోలీస్ సిబ్బంది 24 గంటలు కాపలా కాయాలని, ప్రజలు ఎవరిని రోడ్డు దాటకుండా చూడాలని అన్నారు. పునరావాస కేంద్రాల్లో క్రిమి కీటకాలు విషపూరితమైన పాములు సంచరిస్తూ ఉంటాయని ఎవరికి ప్రాణహాని కలగకుండా చూడాలని అలాగే గ్రామాలలోని పశువులకు కూడా ప్రాణ హాని కలగకుండా చూసే బాధ్యత అధికారుల పై ఉందని అన్నారు.

వరదలు తగ్గుముఖం పట్టి వాతావరణం ప్రశాంతత చేకూరే వరకు అనగా సెప్టెంబర్ మొదటి వారం వరకు అధికారులు కానీ సిబ్బంది కానీ ఎవరు సెలవులు పెట్టకూడదని అందరూ స్థానికంగా ఉండి వారికి అప్పగించిన పనులను బాధ్యతగా చేయాలని ఆయన అన్నారు. అంతకుముందు కొత్తగా నిర్మించే కరకట్ట ప్రదేశాన్ని అనంతరం గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. గోదావరి వరద ప్రవాహం ఎక్కువ వస్తున్నందున కూనవరం నుంచి వచ్చే వాహనాలను ప్రజలను భద్రాచలం రాకుండా చూడాలని ఏఎస్పీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దామోదర్ రావు, ఇరిగేషన్ సీఈ వెంకటేశ్వర్లు, ఈఈ రాంప్రసాద్, సీడబ్ల్యూసీ అధికారులు వివిధ శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed