లాస్ ఏంజెల్స్‌లో తెలంగాణ టూరిజం రోడ్ షోలో మంత్రి జూప‌ల్లి

by Mahesh |
లాస్ ఏంజెల్స్‌లో తెలంగాణ టూరిజం రోడ్ షోలో మంత్రి జూప‌ల్లి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ‌ చరిత్ర, సంస్కృతి, వారసత్వం కేంద్రంగా పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనతో ముందుకెళుతున్నట్లు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ఱారావు అన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, వారసత్వాన్ని కాపాడుకునేందుకు.. నూత‌న ప‌ర్యాట‌క విధానాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణకు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శించ‌డం, పర్యాటకుల, ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా తెలంగాణ‌ను ఆవిష్కరించడమే ల‌క్ష్యం అన్నారు. అమెరికాలోని లాస్ ఎంజెల్స్ లోని డబుల్ ట్రీ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ టూరిజం రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంప్రదాయం, ఆధునికత రెండింటి క‌ల‌బోత తెలంగాణ అని అభివ‌ర్ణించారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, వార‌స‌త్వ సంపద, సహజమైన ప్రకృతి అందాలు, కనువిందు చేసే జలపాతాలు, న‌దులు, సెలయేర్లు, దేవాలయాలు, తెలంగాణ జాన‌ప‌ద క‌ళ‌లు, ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, బతుకమ్మ పండుగ గొప్పత‌నం, పెట్టుబడుల అవకాశాలను మంత్రి వివరించారు. హైదరాబాద్ నగరం దేశంలో మినీ ఇండియా గా ప్రసిద్ధి పొందిందని, ఆ నగరం ప్రపంచ స్థాయి ఐటీ, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా మారిందని పేర్కొన్నారు. ఫ్యూచ‌ర్ సిటీ ప్రాజెక్ట్ పై వివరించారు. ఈ ప్రాజెక్ట్ తో ఐటీ , హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో అద్భుతమైన పెట్టుబడులు కల్పించుకోవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడిదారుల ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. ప్రకాష్ రెడ్డి, సాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా కాన్సుల్ జనరల్ చిట్టిరెడ్డి శ్రీపాల్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed