IND VS BAN : టీ20 సిరీస్‌పై టీమిండియా కన్ను.. నేడు రెండో టీ20

by Harish |
IND VS BAN : టీ20 సిరీస్‌పై టీమిండియా కన్ను.. నేడు రెండో టీ20
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌పై రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది. తొలి టీ20 విజయంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు రెండో టీ20 గెలిస్తే సిరీస్ వశమవుతుంది. నేడు ఢిల్లీ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. భీకర ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ సేనకు రెండో టీ20 కూడా దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా జట్టు బలం తొలి టీ20లోనే అర్థమైంది.

గ్వాలియర్ పిచ్‌పై సూర్యకుమార్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. బౌలర్లో పేసర్ అర్ష్‌దీప్ సింగ్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెరో మూడు వికెట్లు పడగొట్టారు. రెండో మ్యాచ్‌లోనూ ఇదే ప్రదర్శన కొనసాగిస్తే భారత్ విజయం నల్లేరు మీద నడకే. మరోవైపు, సిరీస్‌ను సమం చేయడానికి బంగ్లాదేశ్ కచ్చితంగా పోరాడుతుందనడంలో సందేహం లేదు. లిటాన్ దాస్, కెప్టెన్ శాంటో, తౌహిద్ హృదయ్, మెహిది హసన్ మిరాజ్ లాంటి దూకుడుగా ఆడే బ్యాటర్లు ఆ జట్టులో ఉన్నారు. షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, రిషద్ హుస్సేన్ వంటి నాణ్యమైన బౌలర్లు కూడా ఉన్నారు. భారత ప్లేయర్లు మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి సిరీస్‌ను రెండో టీ20లోనే సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది.

Advertisement

Next Story

Most Viewed