అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

by Vinod kumar |
అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో గురువారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతోపాటు తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది ఒకే వేదిక నుంచి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించినట్లుగా, ఈనెల 15 న మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం అవుతున్న కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం మెడికల్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు.

ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ అందుబాటులో ఉండి, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. శుక్రవారం మరోసారి సమావేశమై ఏర్పాట్లు పర్యవేక్షించాలని కాళోజీ వర్సిటీ వీసీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ని మంత్రి ఆదేశించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే, అందులో మూడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే ఉన్నాయన్నారు. తాజాగా ప్రారంభించే 9 మెడికల్ కాలేజీలతో.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26 కు చేరుతుందని చెప్పారు. కొత్తగా 900 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు.. 2014 లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటే, ప్రస్తుతం 3915 సీట్లు ఉన్నాయన్నారు.

మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన అరోగ్య మహిళ కేంద్రాలను మరో 100 కేంద్రాలకు విస్తరించాలని, ఈనెల 12 న మరో వంద మహిళ అరోగ్య క్లినిక్స్ ప్రారంభించాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే 272 ఉండగా.. వంద కలుపుకొని 372 కు పెరగనున్నాయని అన్నారు. ఆరోగ్య మహిళ ద్వారా ఇప్పటి వరకు 278317 మందికి స్క్రీనింగ్ నిర్వహించి, అవసరం ఉన్న 13673 వారిని ఆసుపత్రులకు తీసుకువెళ్లడం జరిగిందనీ అన్నారు.

5,204 స్టాఫ్ నర్స్ రిక్రూట్ మెంట్ ఫలితాలు త్వరగా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని.. ఏఎన్ఎంల పీయార్సి, ఏరియర్స్ వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మంజూరు చేసిన డీఎంహెచ్వోల నియామకాలకు సంబంధించిన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ రావు, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి శ్రీనివాసరావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed