- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
366 రోజులు పూర్తైన ప్రారంభం కాని వంద పడకల ఆసుపత్రి
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి నియోజకవర్గం కు చెందిన లక్షలాది మంది ప్రజల దశాబ్దాల కల వంద పడకల ఆసుపత్రి, ఉచిత వైద్యం కలగానే మారింది. 2023 ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో నియోజకవర్గంలోని ఏ సభలో చూసిన ఒకటే మాట, ఒకటే వాగ్దానం... పేద ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందిచేందుకే వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఏకంగా అప్పటి రాష్ట్ర మంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి నాయకుడి నోటి మాట ఇదే. కట్ చేస్తే మూడు వందల అరవై ఆరు రోజులు గడిచిన వంద పడకల ఆసుపత్రి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో హడావిడిగా కేపీహెచ్బీకాలనీలోని రెండు ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలంలో 2023 జూన్ 10వ తేదిన అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా 31 కోట్ల వ్యయంతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు అంగరంగ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా హౌసింగ్ బోర్డు అధికారుల నుంచి అధికారికంగా సదరు రెండు ఎకరాల స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకోలేదని విశ్వసనీయ సమాచారం. హౌసింగ్ బోర్డు అధికారులు స్థలం మీకు కెటాయించడం పూర్తి అయింది. జీవో జారి అయింది భూమి తీసుకోండి మహా ప్రభు అంటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఎన్ని సార్లు లేఖలు రాసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భూమిని స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
35 మంది డాక్టర్లు, 89 మంది సిబ్బంది అన్నారు...
కేపీహెచ్బీ కాలనీ లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనుల శంకుస్థాపనకు హాజరైన మంత్రి హరీష్ రావు తొమ్మిది నెలలలో వంద పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేస్తాం. ఆసుపత్రిలో 89 మంది వైద్య సిబ్బంది, 35 మంది డాక్టర్లు 365 రోజులు, 24 గంటలు వైద్య సేవలు అందిస్తారు అంటు ప్రజలతో వాగ్దానం చేశారు. కాగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగి నేటికి సరిగా 366 రోజులు పూర్తి అయిన ఆసుపత్రి పునాదులకు గుంతలు కూడా తీయలేదు.
ఎన్నికలు ముగిశాయిగా..
రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు కూకట్పల్లి నియోజకవర్గంలో జరిగే హడావిడి అంతా ఇంతా కాదు. నియోజకవర్గంలో ఎక్కడ లేని అభివృద్ధి, ఎక్కడ లేని శంకుస్థాపనలు, సభలు సమావేశాలతో ప్రతి కాలనీలో పండుగ వాతావరణం ఉంటుంది. ఎన్నికల పండుగలో భాగంగా మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు, రెండు సార్లు జీహెచ్ఎంసీ ఎన్నికలు, రెండు సార్లు జరిగిన ఎంపీ ఎన్నికలలో ప్రతి బీఆర్ఎస్ నాయకుడు, ప్రజా ప్రతినిధి నోట ఉన్న అతి పెద్ద వాగ్దానం వంద పడకల ఆసుపత్రి. ఎన్నికలకు ఐదు నెలల ముందు హడావిడిగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం మారడంతోనే వంద పడకల ఆసుపత్రి ఊసే తీయడం మరిచారన్న ఆరోపణలు ఉన్నాయి.
వైద్య ఆరోగ్య శాఖకు స్థలాన్ని కేటాయించాం: కిరణ్ బాబు, ఈఈ, హౌసింగ్ బోర్డు శాఖ
కేపీహెచ్బీ కాలనీ లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి రెండు ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హౌసింగ్ బోర్డు నుంచి పలు మార్లు వైద్య ఆరోగ్య శాఖకు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని లేఖను పంపించడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు.
సమాచారం లేదు, నిధుల కోసం ప్రతిపాదనలు పంపుతున్నాం: రఘునాథ్ స్వామి, జిల్లా వైద్య శాఖ అధికారి, మేడ్చల్ జిల్లా.
కేపీహెచ్బీ కాలనీ లోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగిన విషయం తెలుసు, దానికి సంబంధించిన పూర్తి సమాచారం లేదు, నిధులు, నిర్మాణ పనులకు సంబంధించిన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాము.