ఉపాధ్యాయ వృత్తి గౌరవమైంది

by Sridhar Babu |
ఉపాధ్యాయ వృత్తి గౌరవమైంది
X

దిశ, చౌటకూర్ : సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవ ప్రదమైనదని, దేశానికి భావి భారత పౌరులను తీర్చిదిద్దే వారే గురువులని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆన్నారు. గురువారం పుల్కల్ మండల కేంద్రంలో మోడల్ స్కూల్ ను సందర్శించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే జరుపుకుంటామని తెలిపారు.

సమున్నత జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పాత్ర అనిర్వచనీయమని ఆయన అన్నారు. దేశానికి జ్ఞాన సంపన్నులైన, అంకితభావం కలిగిన యువతను అందించేందుకు పాఠశాల, కళాశాల దశల నుంచే బోధన బాధ్యతల్లో ఉన్నవారు తపిస్తారన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి, కాంగ్రెస్ నాయకులు, ప్రిన్సిపాల్​, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story