వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి

by Disha Web Desk 22 |
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి
X

దిశ, మెదక్ ప్రతినిధి: వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో అందించే త్రాగు నీటి సరఫరా పై గూగుల్ మీట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… వేసవి ప్రారంభమైన దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందస్తుగా గుర్తించి ప్రణాళిక బద్దంగా మిషన్ భగీరథ నీరు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేలా చూడాలని అన్నారు. గత సంవత్సరం నీటి ఎద్దడిని ఎదుర్కొన్న గ్రామాలలో సమస్య పునరావృతం కాకుండా చూడాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. మిషన్ భగీరథ ఏఇలు క్షేత్ర స్థాయిలో గ్రామాలు తిరిగి త్రాగునీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సరిచేయాలని అన్నారు. అన్ని గ్రామాల్లో వెంటనే బోర్ల మరమ్మత్తులు, ఫ్లషింగ్ చేయించాలని ఆదేశించారు. త్రాగు నీటిని వృధా కాకుండా గ్రామాలలో ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులు, ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. కార్యాచరణ ప్రణాళిక పై వారంలోగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని మండలాలు, హబిటేషన్స్‌లో ఎక్కడా త్రాగు నీటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని అన్నారు.

త్రాగు నీటి పైప్ లైన్ లేని ప్రదేశాల్లో ట్యాంకర్ సహాయంతో నీటి సరఫరా అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలు ముందే గ్రామాల వారీగా సమీక్షించుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. వేసవిలో గ్రామాల్లో ఓహెచ్ఎస్ ట్యాంకులను శుభ్రంగా ఉంచి, వ్యాధులను నివారించుటకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఎక్కడైనా మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేయడంలో ఇబ్బందులు ఎదురైతే స్థానికంగా నీటి సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, స్థానికంగా ఉన్న నీటి వనరులు, బోరు బావులను గుర్తించాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న త్రాగు నీటి పంపులు, బోరు బావుల మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద త్రాగునీటి సరఫరా కోసం చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామం, ప్రతి బస్తి, ప్రతి మున్సిపల్ వార్డులో త్రాగునీటి సరఫరా ప్రణాళికలు రూపొందించుకోవాలని, నీటి లీకేజీలను ఎప్పటికప్పుడు నియంత్రించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. త్రాగునీటి సరఫరా హెడ్ డిస్ట్రిబ్యూటర్ ఇంట్రా స్థాయిలో నీటి లెవల్ ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఏదైనా సమస్య అయితే సకాలంలో స్పందించి వాటిని త్వరగా పరిష్కరించేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్ సంబంధిత అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, మిషన్ భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed