రూర్భన్ నిధులు ఇంకెప్పుడు వినియోగిస్తారు.. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం..

by Kalyani |
రూర్భన్ నిధులు ఇంకెప్పుడు వినియోగిస్తారు.. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం..
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: రూర్బన్ పథకం కింద మంజూరైన నిధులను ఇంకా ఎప్పుడు ఖర్చు చేస్తారని ఆయా శాఖ అధికారులపై కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రూర్భన్ పథకం పనుల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూర్బన్ పథకం కింద పెద్దకొత్తపల్లి మండలాన్ని ఎంపిక చేసి నిధులు మంజూరు చేసినా పనుల పురోగతి లేదని మండిపడ్డారు. పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, అటవీ, పర్యాటక శాఖల ద్వారా మండలంలో చేపట్టాల్సిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని లేని పక్షంలో నిధులు వృథా అయ్యే ప్రమాదం ఉందన్నారు. లైబ్రరీల ఏర్పాటు, మినీ స్టేడియం, పాఠశాలల్లో పూర్తి సౌకర్యాలతో మరుగుదొడ్లు, శీతల గిడ్డంగుల ఏర్పాటు, మార్కెటింగ్ తదితర పనుల్లో పురోగతి లేదన్నారు. ఎట్టి పరిస్థితిలోను నిధులు వృథా కాకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, డీఎఫ్ఓ రోహిత్ గోపిడి, డీఆర్డీఓ పీడీ నర్సింగ్ రావు, ఈఈ పంచాయతీ రాజ్ దామోదర్ రావు, ఇంట్రా ఈఈ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed