వజ్రోత్సవాల వేళ టీఆర్ఎస్‌కు భారీ షాక్...

by S Gopi |
వజ్రోత్సవాల వేళ టీఆర్ఎస్‌కు భారీ షాక్...
X

దిశ, కల్వకుర్తి/వెల్దండ: కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తీరుకు నిరసనగా శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేసి మండల పార్టీ అధ్యక్షుడికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గెలుపు కోసం తమ వంతు కృషి చేసినప్పటికీ తమకు ప్రాధాన్యతను ఇవ్వకపోవడంతోపాటు, అభివృద్ధి పనులు, ముఖ్యమైన పదవులుఅన్నీ కూడా నియోజకవర్గంలోని ఇద్దరు ముగ్గురు నేతలకే ఇస్తున్నారని ఆరోపిస్తూ సింగిల్ విండో వైస్ చైర్మన్ సంజీవ్ కుమార్ తన వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం సంజీవ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎంపీపీ విజయ జయపాల్ నాయక్, వైస్ ఎంపీపీ శాంతి గోపాల్ నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు వెంకటమ్మ, కుమార్, టాకియా నాయక్, రామకృష్ణ, ఎంపీటీసీలు చిట్టి కుదురం నాయక్, నిరంజన్ తదితరులు అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వెల్డండ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి అందజేశారు. గత కొన్ని సంవత్సరాల నుండి కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలకు కాకుండా ఇప్పటికే రెండు మూడు పదవులలో ఉన్న ఇతర నాయకులకు చైర్మన్ గా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో తాము రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం నిరంతరం పాటుపడే మాకు చోటివ్వకుండా స్వంత నిర్ణయాలు తీసుకుని పార్టీ ప్రతిష్ఠతకు భంగం కలిగిస్తున్నారని ఆవేదనను వెళ్లబోసుకున్నారు.



ప్రగతి భవన్ కు ర్యాలీ

నియోజకవర్గంలో అధికార పార్టీలో జరుగుతున్న అంశాలు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వ్యవహార తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేసేందుకు ఆదివారం ప్రగతి భవన్ కు బయలుదేరి వెళ్తామని సింగిల్ విండో వైస్ చైర్మన్ సంజీవ్ కుమార్ యాదవ్ మీడియాకు వెల్లడించారు. శనివారం తమ రాజీనామా లేఖలను మండల పార్టీ అధ్యక్షుడికి అందజేసిన తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని. . కొందరికే ఎమ్మెల్యే ప్రాధాన్యతను ఇస్తున్నారని, తమను అనేక విధాల ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సంజీవ్ కుమార్ యాదవ్ మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు భారీ ఎత్తున తరలివెళ్తామని ఆయన పేర్కొన్నారు.

తలకొండపల్లి మండలంలో...

నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలంలోని టీఆర్ఎస్ సర్పంచులు వచ్చే ఎన్నికలలో ఏదైనా ఒక పార్టీ నుండి పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డిని కలవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ రాఘవేందర్ రెడ్డి ముందుకు సాగుతూ ఉండడం, తమ గ్రామాలలో అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి నిధులు రాకపోవడంతో పలువురు సర్పంచులు రాఘవేందర్ రెడ్డిని కలిసి రాజకీయంగా అండగా ఉంటామని, గ్రామాల అభివృద్ధికి సహకరించాలని రాఘవేంద్ర రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. నియోజకవర్గంలో పలు మండలాలలో ఇదే విధమైన పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తప్పదని పలువురు అంటున్నారు.

Next Story