దేశానికి రోల్ మోడల్ గా కొత్త రెవెన్యూ చట్టం: మంత్రి పొంగులేటి

by Naveena |   ( Updated:2024-10-05 11:34:01.0  )
దేశానికి రోల్ మోడల్ గా కొత్త రెవెన్యూ చట్టం: మంత్రి పొంగులేటి
X

దిశ, తిరుమలగిరి (సాగర్) : ప్రస్తుతం ఉన్న రెవిన్యూ చట్టంలో మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్ ఉండేలా నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్ ) చట్టాన్ని తీసుకురానున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో తప్పొప్పులను సవరించి,అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించి..నూతన చట్టాన్ని తీసుకువచ్చేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం, నెల్లికల్ గ్రామంలో నిర్వహించిన రైతుల ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గతంలో తెచ్చిన 2020 రెవెన్యూ చట్టం ధరణితో రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. 2020 చట్టాన్ని అలాగే ధరణిలోని తప్పొప్పులను సవరించేందుకు దేశంలోని అన్ని రెవెన్యూ చట్టాలను పరిశీలించి..మేలైన చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సేకరించి పబ్లిక్ డొమైన్ లో ఉంచినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం జరిగిందన్నారు. నూతన రెవెన్యూ చట్టంపై ప్రజల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే చట్టం తీసుకురావాలన్నారు. అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీల సూచనలు సైతం పరిగణలోకి తీసుకొని అతి కొద్ది రోజుల్లోనే నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకురాబోతున్నామని మంత్రి వెల్లడించారు. అర్హులైన పేదవారికి ప్రభుత్వ భూములు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని,ప్రత్యేకించి తిరుమలగిరి సాగర్ లో కొంతమంది పొజిషన్లో ఉన్నప్పటికి పట్టాలు లేవని, పట్టాలున్న వారికి భూమిలేదని ఇతర ప్రభుత్వ భూములకు సంబంధించిన చేస్తున్న సర్వే పూర్తయిన తర్వాత సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. తిరుమలగిరి సాగర్లో సుమారు 13 వేల ఎకరాలకు బోగస్ పట్టా పాస్ పుస్తకాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చారని, తమ ప్రభుత్వం పేదలకు మంచి చేయాలన్నదే తమ తపన అని అన్నారు. ప్రభుత్వాస్తులన్నీ పేదవాడికి చెందాలని, పేదవాడికి చెందేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని చెప్పారు. తిరుమలగిరి సాగర్ లోని 3500 నుంచి 4 వేల ఎకరాలు అర్హులైన పేదవారికి పట్టాలు ఇవ్వాల్సి ఉందని, డిసెంబర్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రిని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి తీసుకువచ్చి ఇక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేస్తానన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతామని మంత్రి వెల్లడించారు.

గతంలో చెప్పినట్లుగానే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, నెలాఖరులోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు మొదటి విడతన 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని , నాగార్జునసాగర్ నియోజకవర్గానికి 5000 ఇండ్లు ఇస్తామని మంత్రి ప్రకటించారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి సర్టిఫికెట్లు లేక బ్యాంకులో మార్ట్గేజ్ లో ఉన్న వాటిని ఆ మార్ట్ గేజ్ అప్పు నిలిపివేసి లబ్ధిదారులకే ఆ ఇండ్లు సొంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే గతంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై గృహనిర్మాణ శాఖలో ఉన్న హక్కు పత్రాలు పెండింగ్ లో ఉన్నాయని, ఆ పెండింగ్ ను క్లియర్ చేసి లబ్ధిదారులందరికీ ఆ హక్కు పత్రాలు ఇచ్చేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ...అడవిదేవులపల్లి, దామరచర్ల మండలాల్లో సైతం గతంలో పట్టాలు ఇచ్చినప్పటికి ధరణిలో నమోదు కాక రుణమాఫీ వంటివి రైతులకు రాలేదన్నారు. అందువల్ల తిరుమల గిరి సాగర్ మాదిరిగానే అడవిదేవులపల్లి, దామరచర్ల మండలాలలో సైతం సర్వే నిర్వహించాలని కోరారు. అనంతరం నాగార్జునసాగర్ శాసనసభ్యులు జయవీర్ మాట్లాడుతూ.. తిరుమలగిరి సాగర్ తో పాటు ,రాష్ట్రవ్యాప్తంగా ధరణి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి సాగర్ ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. దీంతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న ఆశ భావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కర్ణటి లింగారెడ్డిలు హాజరయ్యారు.

Advertisement

Next Story