MLA Vakita Srihari : కేంద్ర, రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

by Sumithra |
MLA Vakita Srihari : కేంద్ర, రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత అభివృద్ధికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని నేత కార్మికులు ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తో పాటు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో రాష్ట్ర చేనేత జౌళి శాఖ నారాయణ పేట జిల్లాకు రెండు చేనేత క్లస్టర్లు మంజూరు చేశారని, అందులో నారాయణపేట క్లస్టర్ అభివృద్ధి పథకం కింద రూ.75.54 లక్షలు(129 మంది), కోటకొండ క్లస్టర్ అభివృద్ధి పథకం కింద రూ. 92.47 లక్షలు(187 మందికి) మంజూరు అయినట్లు ఆమె తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నేత కార్మికుల కోసం రైతు బీమా మాదిరిగా నేతన్న బీమా అనే పథకాన్ని రెండేళ్ల క్రితం ఇదే రోజున ( ఆగస్టు 7న) ప్రకటించారని, ఏడుగురు చేనేత కార్మికులు చనిపోతే ఈ పథకం కింద ఒక్కొక బాధిత కుటుంబానికి రూ.5 లక్షలను వారి వారి ఖాతాల్లో జమ చేశారని కలెక్టర్ చెప్పారు. అలాగే నేతన్నకు చేయూత పథకం ద్వారా ఇప్పటిదాకా 1251 మంది చేనేత మరమగ్గాల కార్మికులను చేర్పించి వారి ఆర్ డీ - 2 ఖాతాల్లో రూ. 383.64 లక్షలు జమ చేశారన్నారు. వీరితో పాటు ప్రధానమంత్రి చేనేత ముద్ర రుణ పథకం కింద 2024-25 కి గాను 9 మంది నేత కార్మికులకు రూ. 10.30 లక్షల వ్యక్తిగత రుణాలను మంజూరు చేశారని తెలిపారు. పావలా వడ్డీ పథకం కింద చిన్నజట్రం చేనేత సహకార సంఘానికి 2022 నుంచి 2023 వరకు 5 త్రైమాసికములకు గాను రాష్ట్ర చేనేత జౌళి శాఖ రూ.లక్ష 6 వేల 391 మంజూరు చేశారన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులతో పాటు రూ.25 వేల నగదు పురస్కారాలు దక్కించుకున్న కొస్గి మండలం హకీం పేటకు చెందిన కండురి శ్రీనివాస్, నారాయణ పేట మండలం జాజాపూర్ గ్రామానికి చెందిన కత్రి ప్రమీలకు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

నారాయణ పేటలో 400 మగ్గాలకు గాను ప్రస్తుతం 30 మగ్గాలు ఉండటం బాధాకరమని, జిల్లాలో చేనేత రంగం అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. సిరిసిల్లలో చేనేత వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందిందో నారాయణ పేట చెనేత వ్యవస్థ అంతకు మించి అభివృద్ధి చెందాలని, అందుకోసం నారాయణ పేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికా రెడ్డి, తాను కలిసి ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు. ఒక్కప్పుడు 400 ఉన్న మగ్గాలు నేడు 30 కి చేరడం బాధ కలిగించే విషయమైనా నారాయణ పేటలో 4 వేల మగ్గాలకు చేరినా ఇక్కడి కార్మికులు పనిచేస్తారని చెప్పారు. తాను అమరచింత చేనేతల అభివృద్ది కోసం అసెంబ్లీలో మాట్లాడానని, ఈ సారి నారాయణ పేట జిల్లా చేనేత రంగం అభివృద్ది కోసం అసెంబ్లీలో మాట్లాడి ఈ ప్రాంత చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం నారాయణపేటలో చేనేత వృత్తిని కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్న కార్మికులను కలెక్టర్, ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె అనసూయ, ఆర్డీవో మధుమోహన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed