విద్యార్థులలో సామర్ధ్యాలు పెంచవలసిన బాధ్యత ఉపాధ్యాయులదే.. కలెక్టర్

by Sumithra |
విద్యార్థులలో సామర్ధ్యాలు పెంచవలసిన బాధ్యత ఉపాధ్యాయులదే.. కలెక్టర్
X

దిశ, కొత్తగూడెం : విద్యార్థులలో విద్యా సామర్ధ్యాలు పెంచడానికి ఉపాధ్యాయులు 100% కృషి చేయాలని, దాని కై ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారులు తగు ప్రణాళికలు రచించుకుని వాటిని సమర్థవంతంగా అమలుపరచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. గురువారం కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల మౌలిక వసతుల పై పూర్తి దృష్టి పెట్టామని, దీని కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. పాఠశాలల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు నిధులు విడుదల చేశామని అన్నారు. వీటిని పాఠశాల పరిశుభ్రత కొరకు అలాగే దానికి సంబంధించిన సామాన్లు కొనుగోలుకు మాత్రమే వినియోగించాలని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ఈ పనులను పాఠశాలలో నిర్వహించాలని తెలిపారు.

పదో తరగతి పరీక్షల గురించి చివరి రెండు నెలల్లో ప్రణాళికలు రచించడం కాకుండా మొదటి నుండే ప్రణాళిక బద్ధంగా పిల్లలను చదివించి పరీక్షలకు సమాయత్తం చేయటం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. పాఠశాలల్లో ఔషధ మొక్కలు అలాగే అవసరమైనటువంటి ఇతర మొక్కలను ఏర్పాటు చేయటానికి ప్రధానోపాధ్యాయులు చేసిన కృషిని అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో త్వరలో పాఠశాల వ్యవసాయం అనే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని, దానికి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు అందరూ సహకరించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు ఇంటి వద్ద రాత పనిని ప్రోత్సహించిన వారికి నోటు పుస్తకాలను అందిస్తున్నామని, ఈ నోటు పుస్తకాలు ఏ విధంగా ఉపయోగించాలి అనే అంశం మీద జిల్లా రిసోర్స్ గ్రూప్ పని చేసిందని అన్నారు. వాటిని సమర్థవంతంగా వినియోగింప చేయటం కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాధికారుల బాధ్యత అని తెలిపారు.

ప్రతి పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఆయా తరగతికి సంబంధించిన మౌలిక భాష, మిడత సామర్థ్యాలను అభివృద్ధి చేసి జిల్లాలో మౌలిక భాష, గణిత అభివృద్ధి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలు జిల్లా నుండి తప్పనిసరిగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వర చారి, ప్రభుత్వ పరిక్షల సహాయ కమిషనర్ మాధవరావు, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్, జిల్లా సైన్స్ అధికారి చలపతిరాజు, జిల్లాలోని అన్ని మండలాల మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Next Story