కులమతాలకు అతీతంగా విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం

by Sridhar Babu |
కులమతాలకు అతీతంగా విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం
X

దిశ, తిమ్మాపూర్ : కులమతాలకు అతీతంగా విద్యను పొందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం తిమ్మాపూర్ మండల శివారులోని యాదవుల పల్లి గ్రామంలో 20 ఎకరాల స్థలంలో నిర్మించదలిచిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కుల, మత ప్రతిపాదికన గురుకులాలు ఏర్పాటు చేసి విద్యను అందించిందని విమర్శించారు. రైతులకు రూ. 2 లక్షలలోపు రుణ మాఫీ చేస్తున్నామని అన్నారు. గ్రామాల్లో ఇంకా ఎవరికైనా రుణమాఫీ కాకుంటే అధికారులను సంప్రదించాలని కోరారు.

రూ. 2 లక్షలపైన రుణాలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేసే ఆలోచన ఉందని, పైన ఉన్న రుణాన్ని వారు చెల్లిస్తే మిగతా రుణమాఫీకి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం విద్యా, వైద్యం, వ్యవసాయాభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని అన్నారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తుంటే తాము ఇచ్చిన నోటిఫికేషన్లతోనే ఉద్యోగాలు ఇస్తున్నారని బీఆర్ఎస్ అనడం సిగ్గు చేటని అన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం, ఎవరితోనో ఒకరితో కోర్టులో కేసులు వేయించి నిలిచిపోయేలా చేయటం చూశామన్నారు.

డీఎస్సీ ద్వారా 10 వేల మందికి 56 రోజుల్లోనే ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ వచ్చే జూన్ అకాడమిక్ ఇయర్ లోపు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేళా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు ప్రఫూల్ దేశాయి, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్, తహసీల్దార్ విజయ్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోరేపల్లి రమణారెడ్డి, నాయకులు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, రమేష్, శ్రీగిరి రంగారావు, బుధారపు శ్రీనివాస్, కొత్త తిరుపతిరెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, ఎల్కపెల్లి సంపత్, సమద్, ఆషిక్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed