మాతృమరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి

by Sridhar Babu |
మాతృమరణాలు లేకుండా  జాగ్రత్తలు తీసుకోండి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : జిల్లాలో మాతృ మరణాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం 2023-24 సంవత్సరంలో సంభవించిన మాతృ మరణాలపై వైద్యాధికారులు, కమిటీ సభ్యులు, మృతుల కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని, ప్రతి పీహెచ్సీ లో గర్భిణీగా నమోదైనప్పటి నుండి ఆమెకు నిర్వహించే వైద్య పరీక్షల వివరాలు ఎంపీపీ కార్డులో నమోదు చేయాలన్నారు. గర్భిణీకి వైద్య సేవలు అందించే సమయంలో ప్రొటోకాల్ పాటించాలని, ప్రమాద పరిస్థితుల్లో ఉన్న గర్భిణీలను ఆలస్యం చేయకుండా సరైన సమయంలో దగ్గరలో ఉన్న ఉన్నత స్థాయి ఆసుపత్రికి రిఫర్ చేసి రక్షించాలని కోరారు.

రక్తహీనత ముందుగానే గుర్తించి అవగాహన కల్పించాలని, శిశు మరణాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. ఇప్పటి వరకు జరిగిన మాతృ మరణాలను సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఆస్పత్రులలో డెలివరీ పాయింట్స్ వద్ద ఎక్కడైతే బ్లడ్ బ్యాంక్ అవసరం ఉందో అక్కడ ఏర్పాటు చేయాలని, ప్రతి కేంద్రంలో అన్ని సదుపాయాలు కల్పించాలని, మాతృ మరణాలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. గర్భిణీలకు సరైన వైద్య చికిత్స అందించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, డీసీహెచ్ఎస్. రాజేంద్రనాథ్​, నోడల్ అధికారులు డాక్టర్ సుచిత, డాక్టర్ సాధియా బేగం, డాక్టర్ జయమాలిని, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story