తెలంగాణకు భారీ పెట్టుబడి.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు

by srinivas |
తెలంగాణకు భారీ పెట్టుబడి.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు
X
  • లైఫ్ సైన్సెస్ రంగంలో 16,650 కోట్లు
  • అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ
  • ఆసియాలోనే పెద్ద పెట్టుబడి
  • ఐటీ, లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం బలానికి నిదర్శనం
  • - మంత్రి కేటీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలను విస్తరించేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో రెండు బిలియన్ డాలర్లు (రూ.16,650కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సముఖత ప్రకటించింది. దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలో ఈలైఫ్ సైన్సెస్ రంగంలో అతిపెద్ద పెట్టుబడి. ఈ పెట్టుబడి ద్వారా అడ్వెంట్ సంస్థ ఏపీఐ, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు దోహదపడుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో శుక్రవారం సంస్థ ఎండీ పంకజ్ పట్వారి, ఆపరేటింగ్ పార్ట్నర్ వైదీష్ అన్నస్వామి భేటీ అయ్యారు. సంస్థ పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలను చర్చించారు. పెట్టుబడితో పాటు జినోమ్ వ్యాలీలో 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అడ్వెంట్ ఇంటర్నెషనల్ సంస్థ హైదరాబాద్ సువెన్ ఫార్మస్యూటికల్ కంపెనీలో దాదాపు 9,589 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు తన కోహన్స్ ప్లాట్ఫారం ద్వారా మరిన్ని సంస్థలలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో నూతన పెట్టుబడుల ద్వారా భారీ ఎత్తున విస్తరిస్తుండడం ఐటీ, లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం బలానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి లైఫ్ సైన్సెస్ ఈకోసిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపట్టామని, పరిశ్రమ భాగస్వాములతో కలిసి చేపట్టిన అనేక కార్యక్రమాలు లైఫ్ సైన్సెస్ ఈకోసిస్ట్ వేగంగా వృద్ధి అయ్యేలా చేస్తున్నాయన్నారు. అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న ఇన్నోవేషన్, వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని అడ్వెంట్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ పట్వారి తెలిపారు. కోహన్స్ ప్లాట్ఫారం ద్వారా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed