బెంగళూరులో విదేశీయుల అక్రమ డ్రగ్స్ దందా...

by Kalyani |
బెంగళూరులో విదేశీయుల అక్రమ డ్రగ్స్ దందా...
X

దిశ, సిటీ క్రైమ్ : డ్రగ్స్ సరఫరా కోసం డెడ్ డ్రాప్ (కాంటాక్ట్ లెస్) పద్ధతిని ఎంచుకుని హైదరాబాద్ లో అక్రమంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న సూడాన్ దేశస్థుడిని శుక్రవారం హైదరాబాద్ హెచ్ఎన్యూ, హుమాయున్ నగర్ పోలీసులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ ను జరిపి అరెస్టు చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించిన వివరాల ప్రకారం...బెంగళూరు లో నివాసం ఉంటున్న నైజీరియన్స్, టాంజానియా, పాలస్తీనా, సుడాన్ దేశాలకు చెందిన వారి నుంచి డ్రగ్స్ ను తక్కువ ధరకు తీసుకుని వాటిని నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్న సమాచారాన్ని హైదరాబాద్ హెచ్ఎన్యూ పోలీసు సేకరించారు. హుమాయున్ నగర్ పోలీసుల సహకారంతో జాయింట్ ఆపరేషన్ ను నిర్వహించి సూడాన్ కు చెందిన మహ్మద్ ఉస్మాన్ ను శుక్రవారం అరెస్టు చేశారు. అతని నుంచి 7.75 లక్ఱలు విలువ చేసే 50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, ఐ-ఫోన్ 13ను స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు.

డెడ్ డ్రాప్ పద్ధతిలో సరఫరా--

ఈ డ్రగ్స్ దందా లో పోలీసులకు చిక్కకుండా మహ్మద్ ఉస్మాన్ కాంటాక్ట్ లెస్ పద్ధతిలో చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ డెడ్ డ్రాప్(కాంటాక్ట్ లెస్) పద్ధతిలో ఒకరికి ఒకరు కలుసుకోకుండానే మత్తు పదార్ధాలు డెలివరి అయిపోతాయి. మత్తు పదార్థం ఆర్డర్ తీసుకోగానే డబ్బులను ఫోన్ పే, జీ పే ద్వారా వేయించుకుని , ఆ తర్వాత డ్రగ్స్ పెట్టిన లోకేషన్, ఎందులో ఉందనే ఫోటోను ఆర్డర్ ఇచ్చిన వారికి పంపిస్తారు. దాని ద్వారా ఆర్డర్ ఇచ్చిన అతను ఎవరికి అనుమానం రాకుండా తీసుకుని వెళ్ళిపోతారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

చదువుకునేందుకు వచ్చి డ్రగ్స్ దందా--

“సుడాన్ కు చెందిన మహ్మద్ ఉస్మాన్ 2016 లో స్టూడెంట్ వీసా మీద మొదటి సారిగా ఇండియాకు వచ్చి టోలిచౌకి ప్రాంతంలో నివాసం ఉన్నాడు. ఏడాది చదువు పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళిపోయి 2018 లో 4 సంవత్సరాల స్టూడెంట్ వీసా మీద వచ్చాడు. కరోనా కాలంలో తిరిగి వారి దేశానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చి ఉత్తర్ ప్రదేశ్ లోని గ్లోబల్ యూనివర్సిటీలో బీసీఏ చదువుతున్నాడు. ఆర్థిక కష్టాలు భారం కావడంతో మహ్మద్ ఉస్మాన్ బెంగళూరులోని సూడాన్, టాంజానియా, నైజీరియా, పాలస్తీనా దేశాలకు చెందిన వారితో పరిచయం చేసుకుని అందులో మత్తు మందు దందా చేసే కొంతమంది నుంచి వాటిని సేకరిస్తున్నాడు.” తక్కువ ధరకు తీసుకుని హైదరాబాద్ లో అధిక ధరలకు విక్రయిస్తు అక్రమ డ్రగ్స్ దందాను చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. జాయింట్ అపరేషన్ లో అతనిని అరెస్టు చేశారు.

ఐ- ఫోన్ లో 11 మంది చిట్టా---

మహ్మద్ ఉస్మాన్ నుంచి మత్తు పదార్ధాలను కొనుగోలు చేస్తున్న 11 మంది చిట్టా పోలీసులకు చిక్కింది. ఇందులో సంపన్నుల కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు. దర్యాప్తులోని నిబంధనల ద్రుష్ట్యా వారి పేర్లను వెల్లడించలేమన్నారు. వారిని విచారిస్తామన్నారు. ఉస్మాన్ ఐ-ఫోన్ నుంచి అక్రమ డ్రగ్స్ దందాకు సంబంధించిన మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.

మరో కేసులో.....

కంచన్ బాగ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహ్మద్ ఇమ్రాన్ తన కోరికలు, ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు బెంగళూరులో నివాసం ఉంటూ అక్రమంగా మత్తు దందా చేస్తున్న విదేశియుల నుంచి తక్కువ ధరకు వాటిని సేకరించి హైదరాబాద్ అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ఇమ్రాన్ తో పాటు అతనితో కలిసి దందా చేస్తున్న నందాకుమార్, నవీన్ లను హెచ్ఎన్యూ, కంచన్ బాగ్ పోలీసులు సంయుక్తంగా శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 80 గ్రాము ఎస్ ఎస్ డి బ్లాట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ ఆనంద్ తెలిపారు. ఇమ్రాన్ పై గతంలో కూడా మత్తు పదార్ధాల సరఫరాకు సంబంధించిన కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed