భవ్య భారత నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర: స్వామి బోధమయానంద

by srinivas |
భవ్య భారత నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర: స్వామి బోధమయానంద
X

దిశ, హైదరాబాద్: భవ్య భారత నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. ఆధునిక సవాళ్లకు 'సనాతన పరిష్కారాలను' చూపేందుకు స్వామి వివేకానంద బోధనలు తోడ్పడతాయన్నారు. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న 600 పాఠశాలలు, విద్యాసంస్థలలోని ఉపాధ్యాయులు, స్వామీజీలు ఈదిశగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో విద్యపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన హైదరాబాద్ ఐ.ఐ.టి డైరెక్టర్ డా. బి.యస్. మూర్తి మాట్లాడుతూ విద్యార్థులకు నచ్చిన కోర్స్ ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలన్నారు. 18 ఏళ్లకు ప్రధానిని ఎన్నుకునే హక్కు వస్తుందని, నచ్చిన కోర్సును ఎంపిక చేసుకునే హక్కు మాత్రం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వికసిత భారతాన్ని సాధించాలంటే విద్యాసంస్థలు పరిశ్రమలతో కలిసి పని చేయాలని ఆయన సూచించారు.

వివేకానంద ప్రవచించిన త్యాగం -సేవా నిరతిని విద్యార్థులలో పెంపొందించడం ద్వారా ఉన్నతమైన సమాజాన్ని నిర్మించవచ్చని కార్యక్రమంలో ప్రసంగించిన వక్తలు తెలిపారు. సదస్సు ద్వారా తామెంతో ప్రయోజనం పొందామని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తెలిపారు. సదస్సులో వివిధ విద్యాసంస్థలకు చెందిన వెయ్యిమందికి పైగా ప్రతినిధులు విద్యావేత్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed