హైడ్రా అధికారుల దూకుడు.. చెరువుల పరిరక్షణపై కీలక మీటింగ్

by srinivas |   ( Updated:2024-10-24 17:09:18.0  )
హైడ్రా అధికారుల దూకుడు.. చెరువుల పరిరక్షణపై కీలక మీటింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘శ‌రీరానికి నాడీ వ్య‌వ‌స్థ ఎంత ముఖ్య‌మో.. చెరువుల‌కు నాలా వ్య‌వ‌స్థ అంతే అవ‌స‌రం. నాలాలు స‌రిగా ఉంటే.. వ‌ర‌ద నీరు సాఫీగా చెరువుకు చేరుతుంది. అనుసంధానం ఉన్న‌ప్పుడే ఒక దాని త‌ర్వాత మ‌రో చెరువు నిండుతుంది. ఆ గొలుసు తెగ‌కుండా చూడాలి. ఎక్క‌డైనా ఆటంకాలు ఏర్ప‌డితే వాటిని పున‌రుద్ధ‌రించాలి. చెరువుల అనుసంధానం, గొలుసుకట్టు చెరువుల పరిరక్షణతోనే వరద ముప్పుకు కట్టడి చేయొచ్చు‘ అని వాటర్‌-ఉమెన్ రైట్స్ యాక్ట‌విస్టు డా. మ‌న్సీబాల్ భార్గ‌వ‌ అన్నారు. చెరువులు, నాలాల ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు వాటికి పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు ఆయా సంస్థల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే స్వ‌చ్ఛంద సంస్థ‌లు, లేక్‌మ్యాన్స్‌, జ‌ల‌వ‌న‌రుల అభివృద్ధికి సంబంధించిన ప‌లువురు ప‌రిశోధ‌కులు, నిపుణ‌ల‌తో హైడ్రా స‌మావేశాలు నిర్వహిస్తోంది.

గురువారం హైడ్రా కార్యాల‌యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారి ఆధ్వ‌ర్యంలో వాటర్‌-ఉమెన్ రైట్స్ యాక్ట‌విస్టు డా. మ‌న్సీబాల్ భార్గ‌వ‌తో స‌మావేశమయ్యారు. న‌గ‌రంలో చెరువుల ప‌రిస్థితిపై స‌మీక్షించారు. వాటికి పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను రంగనాథ్ వివరించారు. హైడ్రా చ‌ర్య‌ల‌ ప‌ట్ల డాక్టర్ మ‌న్సీబాల్ భార్గ‌వ‌ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌తోనే న‌గ‌రానికి వ‌ర‌ద‌ముప్పు త‌ప్పుతుందంటూ భార్గ‌వ‌ సూచించారు. భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో బెంగ‌ళూరులోని చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయని గుర్తు చేశారు. ఇలాంటి ప‌రిస్థితులు న‌గ‌రంలో త‌లెత్త కూడ‌దంటే చెరువుల అనుసంధానం, గొలుసుక‌ట్టు చెరువులు, నాలా వ్య‌వ‌స్థ స‌రిగా ఉండాల‌ని తేల్చిచెప్పారు.

స‌హ‌జ‌సిద్ధంగా చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం క‌ల్పించే ప‌ద్ధ‌తుల‌ను వివ‌రించారు. చెరువుల‌కు కాలువులు జీవ‌నాడులు.. వాటిని ముందుగా ప‌రిర‌క్షించుకుంటూ.. ఆ కాలువ‌ల నుంచి మంచి నీరు వ‌చ్చేలా చూస్తే .. చెరువుల కాలుష్యం త‌గ్గుతుందంటూ సూచ‌న‌లు చేశారు. కాంక్రీట్ క‌ట్ట‌డాలు కాకుండా.. స‌హ‌జ‌సిద్ధంగా చెరువుల‌ను పున‌రుద్ధ‌రించిన‌ప్పడే వాటిలో జీవ‌క‌ళ ఉంటుంద‌ని.. ఆ నీరు జీవ‌రాసుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. ఇలా త‌క్కువ ఖ‌ర్చుతో చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం సాధ్య‌మౌతుందని, ఆ విధానాలపై ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్‌ ద్వారా వివరించారు. నెల‌లో కుర‌వాల్సిన వ‌ర్షం ఒక్క రోజులోనే.. ఒక్క రోజులో కురిసే వ‌ర్షం ఒక గంట‌లో ప‌డి న‌గ‌ర జీవ‌నాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న వేళ.. వ‌ర‌ద నీటి కాలువ‌లు ఎలా ఉండాలనే అంశంపై లోతైన చ‌ర్చ చేశారు. ‘వ‌ర‌ద నీరు చెరువుకు చేరాలి. చెరువులు నిండితే ఆ నీరు న‌దుల్లో క‌ల‌వాలి.. అలా కాకుండా ఆటంకాలు ఏర్ప‌డితే నివాసాలు నీట మునుగుతాయి. చెరువుల‌లో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గింపు.. న‌గ‌రం ముంపున‌కు గురి కాకుండా చేసిన శ‌స్త్ర చికిత్స లాంటిది.’ అని డా. మ‌న్సీబాల్ భార్గ‌ వివరించారు.

Advertisement

Next Story