ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణాలపై హెల్త్ మినిస్టర్ కీలక ప్రకటన

by Satheesh |
ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణాలపై హెల్త్ మినిస్టర్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణాలపై హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహా కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లతో బుధవారం మంత్రి రాజనర్సింహా చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా కొత్త ఆస్పత్రి నిర్మాణ విషయం కోర్టులో ఉందని గుర్తు చేసిన హెల్త్ మినిస్టర్.. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భనవాలు కట్టేందుకు మేం సిద్ధమని ప్రకటించారు. ఉస్మానియా హాస్పిటల్ గురించి సరైన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి వసతి గృహాలపై జుడాలు ఫిర్యాదు చేశారని, హాస్టళ్లలో సౌకర్యాలు మెరుపర్చాలని కోరారని తెలిపారు. తమకు మరింత భద్రత కల్పించాలని జూడాలు కోరినట్లు మంత్రి వెల్లడించారు.

జూడాల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని, సీఎం ఆదేశాల మేరకు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను సందర్శించామని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో సౌకర్యాల కోసం రూ.121 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రి కోసం రూ.80 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. కాకతీయ మెడికల్ కాలేజీకి సీసీ రోడ్డు మంజూరు చేశామన్నారు. వైద్య సౌకర్యాలు మెరుగుపర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వైద్యశాఖ విధానాల్లో కూడా మార్పులు తీసుకువస్తున్నామని, పేదలకు వారివారి ప్రాంతాల్లోనే వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు విద్య, వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

Advertisement

Next Story