Harish Rao: ఉన్నమాట అంటే ఉలుకిపాటు ఎందుకు?.. బీఆర్ఎస్ నేత ఫైర్

by Ramesh Goud |
Harish Rao: ఉన్నమాట అంటే ఉలుకిపాటు ఎందుకు?.. బీఆర్ఎస్ నేత ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉన్నమాట అంటే ఉలుకిపాటు ఎందుకు? మేం చెప్పిన వాటిల్లో ఏది అబద్దం అని, సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం సరికాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గ్రామ పంచాయితీ నిధుల విడుదలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నదని అన్నారు. మేం పదేపదే అబద్ధం చెబుతున్నామని గౌరవ మంత్రి సీతక్క అంటున్నారని తెలిపారు.

అలాగే ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదని, కేంద్రం నుండి ఉపాధి హామీ, హెల్త్ మిషన్ వంటి పథకాల కింద వచ్చిన 2100 కోట్ల నిధులను గ్రామాలకు ఇవ్వకుండా దారి మళ్ళించిందని ఇందులో ఏది అబద్దమని నిలదీశారు. అలాగే 15 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన 500 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా ఆపారని, మాజీ సర్పంచ్ లు పెండింగ్ బిల్లుల కోసం ఛలో సచివాలయం పిలుపు నిస్తే వారిని పోలీస్ స్టేషన్ల లో నిర్బంధించారని, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం అటకెక్కడం లాంటివన్నీ మేం చెప్పిన అబద్దాలేనా? అని మండిపడ్డారు.

అంతేగాక గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో డెంగీ, మలేరియా వంటి సీజనల్ రోగాలు ప్రబలుతున్నాయని, రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించడం లేదని, 8 నెలలుగా జడ్పిటిసిలు, ఎంపిటిసిలకు గౌరవ వేతనం ఇవ్వకపోవడం కూడా అబద్ధమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలకు నెలనెల 275 కోట్లు, సంవత్సరానికి 3,300 కోట్ల నిధులు విడుదల చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించకుండా, సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం సరికాదని, ఈ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయన్నది పచ్చి నిజమని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని హరీష్ రావు ఎక్స్ వేదికగా కోరారు.

Advertisement

Next Story