Harish Rao: జల్ జంగల్ జమీన్ నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్.. బీఆర్ఎస్ నేత ట్వీట్

by Ramesh Goud |
Harish Rao: జల్ జంగల్ జమీన్ నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్.. బీఆర్ఎస్ నేత ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వారి దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని, కొమురం భీమ్ నినాదాన్ని నిజం చేసింది కూడా కేసీఆరే నని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. విధ్వంసపు దారుల నుంచి వికసిత తోవలు.. మోడువారిన బతుకుల్లో మోదుగు పూల పరిమళాలు అంటూ.. గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రధానంగా ఆదివాసీల మూడు డిమాండ్లయిన స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు భూముల పట్టాలను నిజం చేసింది కేసీఆర్ గారేనని స్పష్టం చేశారు.

మావ నాటే మావ రాజ్.. అని, మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీల ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేస్తూ 2,471 గూడేలను, తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చారని గుర్తుచేశారు. అంతేగాక విద్య, ఉద్యోగ రంగాల్లో ఆదివాసీ గిరిజనుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు వారికి 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఇక జల్..జంగల్.. జమీన్ అన్న కొమురం భీమ్ నినాదాన్ని కేసీఆర్ నిజం చేశారని అన్నారు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ఆదివాసీ, గిరిజనులకు శుభాకాంక్షలు అని హరీష్ రావు ఎక్స్ లో రాసుకొచ్చారు.

Advertisement

Next Story