Harish Rao: న్యాయం చేస్తావా? చరిత్ర హీనుడిగా మిగులుతావా?.. కోమటిరెడ్డిపై హరీశ్ రావు ఫైర్

by Prasad Jukanti |
Harish Rao: న్యాయం చేస్తావా? చరిత్ర హీనుడిగా మిగులుతావా?.. కోమటిరెడ్డిపై హరీశ్ రావు ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ తీరు ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న చందంగా ఉందని, ఎన్నికలకు ముందు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చుతామని హామీ ఇచ్చి ఇప్పుడేమో పోలీసు బలగాలతో బాధితులను బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. రోడ్డుకు 28 కిలోమీటర్ల పరిధిలోనే సర్వే చేయించి, ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టాలని బలవంత పెట్టడం సరికాదన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని తన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును ట్రిబుల్ ఆర్ బాధితులు, రైతులు కలిశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని ఎన్నికల తర్వాత మాట తప్పారని హరీశ్ రావు వద్ద వాపోయారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధితుల ఆవేదన విన్న హరీశ్ రావు.. ప్రభుత్వం దిగివచ్చేలా బాధితుల పక్షాన పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

మభ్య పెట్టడమే కాంగ్రెస్ పద్దతా?

ఉత్తర దిక్కున ఆర్ఆర్ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల్లో హమీ ఇచ్చారని ఈ హామీని ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిలు నిలబెట్టుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బాధితులకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేత హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. ఎంపీగా ఉన్నపుడు కోమటి రెడ్డి బాధితులతో కలిసి అలైన్ మెంట్ మార్చాలని, రాయగిరి, చౌటుప్పల్ రైతులతో కలిసి ధర్నాలు చేసి, ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటి రెడ్డికి మతి మరుపు ఎక్కువ అయినట్లు ఉందని వారు చెప్పిన హామీల వీడియోలు వారికే పంపిస్తున్నా చూసుకోవలన్నారు. ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట నా? ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. నాడు ఫార్మా సిటీ అన్నారు, నేడు మాట మార్చారు. నాడు ఆర్ఆర్ఆర్ రోడ్డు అలైన్మెంట్ మార్పు అన్నారు. నేడు మాట మార్చారు. మాట మార్చడమే మీ విధానమా? ప్రజలను మభ్య పెట్టడమే కాంగ్రెస్ పద్దతా? అని నిలదీశారు. 'కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీరు.. జిల్లా మంత్రిగా, శాఖ మంత్రిగా ఉన్నారు. నల్గొండ ప్రజలకు న్యాయం చేస్తారా? లేక చరిత్ర హీనుడుగా మిగుపుతారా? అని ప్రశ్నించారు.

ఆర్ఆర్ఆర్ ఏర్పాటు విషయంలో ఉత్తర భాగంలో 40 కిలోమీటర్లకు బదులుగా 28 కిలో మీటర్లను పరిగణలోకి తీసుకొని జంక్షన్ ఏర్పాటు చేయడం వల్ల చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మధ్య నుండి రోడ్డు వెళ్లడం వలన మున్సిపాలిటీ రెండు భాగాలుగా విడిపోతున్నదనీ, బాధితులు రెండు పంటలు పండించే పచ్చని పొలాలను, ఇండ్లు, ప్లాట్లను కోల్పోతున్నారని చౌటుప్పల్ వద్ద జంక్షన్ రింగు గతంలో 78 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు 184 కు పెంచడం వల్ల పేదల భూములు, ప్లాట్లు కోల్పోతున్నారు. దీనికి గాను నష్టపరిహారం కూడా తక్కువ చెల్లిస్తున్నారన్నారు. దక్షిణ భాగాన ఆర్ఆర్ఆర్ కోసం ఎలాగైతే 40 కిలోమీటర్లు పరిగణలోకి తీసుకుంటున్నారో, ఉత్తర బాగానే ఉన్న చౌటుప్పల్ వైపు 40 కిలోమీటర్లు పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

మీ మాటలు ప్రజలు నమ్మడం లేదని, ప్రియాంక గాంధీ చేత హామీలు చెప్పించి ఇప్పుడు మాట తప్పారని దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ వారిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తూన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా మా మీద విమర్శలు చేయడం మాని ఎన్నికల్లో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. లేదంటే బాధితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన హామీలను ప్రియాంక గాంధీ చొరవ తీసుకొని బాధితుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆదేశించాలన్నారు. ప్రియాంక గాంధీ ఇచ్చిన మాట మీద నిలబడతారా? లేదా కాంగ్రెస్ నైజమే ఇంత అని మాట తప్పుతారా? అని ప్రశ్నించారు.

Next Story

Most Viewed