loan waiver: ఎల్లుండి కీలక ఘట్టం.. మూడో దశ రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటన

by Prasad Jukanti |
loan waiver: ఎల్లుండి కీలక ఘట్టం.. మూడో దశ రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రైతాంగాన్ని రుణ విముక్తులను చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట ప్రకారం రుణమాఫీ ప్రక్రియను కొనసాగిస్తున్నది. ఇప్పటికే రూ. లక్షన్నర వరకు ఉన్న రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం.. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడో విడత పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు పంద్రాగస్టున మూడో విడత రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నట్లు సీఎంవో మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. విదేశీ పర్యటన నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చీ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా మండలంలో పర్యటించబోతున్నారని ఆ సందర్భంగానే మూడో విడత రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తారని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని ఆగస్ట్ 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేసి చూపించారని తెలిపింది.

కీలక ఘట్టానికి రుణమాఫీ ప్రక్రియ:

32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31 వేల కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జులై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం.. మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టిందని, జులై 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న 11,14,412 మంది రైతులకు రూ.6034.97 కోట్లు విడుదల చేసిందని తెలిపింది. ఆ తర్వాత జులై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసిందని ఇందులో ఒక లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణమున్న దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లు జమ చేసిందని వెల్లడించింది. కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు రూ.12 వేల కోట్లకుపైగా రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని పేర్కొంది.

మూడో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ కోసం లబ్ధిదారులైన రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయబోతున్నట్లు పేర్కొంది. దీంతో రుణమాఫీలో కీలక ఘట్టం ముగియనుందని సీఎంవో తెలిపింది. ఇక రూ.2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ విధి విధానాల్లో ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించిందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed