Eatala: నగరంలో ఉగ్రదాడులకు కుట్రలు.. బీజేపీ ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-10-21 10:04:56.0  )
Eatala: నగరంలో ఉగ్రదాడులకు కుట్రలు.. బీజేపీ ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం ఘటనపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుందని, పోలీసులే మఫ్టీలో రెచ్చగొట్టి దాడులకు పాల్పడ్డారని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. ఈ సందర్భంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, దేవాలయాలను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని వినతీ పత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం నిమ్మకునీరేతినట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే నిందితుడిని పిచ్చోడు అని ముద్ర వేసి వదిలేసే ప్రయత్నం చేశారని, శాంతియుతంగా ర్యాలీ తీస్తుంటే పోలీసులు దుర్మార్గంగా లాఠీఛార్జ్ చేసి అరెస్టులు చేశారని మండిపడ్డారు. ఉగ్రదాడులకు నగరంలో ఎంతోమంది బలయ్యారని, మళ్లీ అలాంటి దాడులకే దుర్మార్గులు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొంతమంది ప్రవర్తిస్తున్నారని, పోలీసులే మఫ్టీలో రెచ్చగొట్టి ర్యాలీలో దాడులు, లాఠీ ఛార్జ్ జరిగేలా చేశారని ఆరోపించారు. ఇక నిందితులను కటినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి సూచించాలని గవర్నర్ ను కోరినట్లు తెలిపారు.

అలాగే అంతకుముందు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే సీఎం రేవంత్ ఇంతవరకు ఖండించలేదని, నిజాం నిరంకుశ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. హిందూ దేవాలయాల మీద దాడి చేస్తే సహించేది లేదని, నిందితుల మీద ప్రభుత్వం కేసు పెట్టకుండా ఏం చేస్తోందని మండిపడ్డారు. వంద నగరాల్లో దాడులకు కుట్ర చేసినట్లు తెలుస్తోందని, రాష్ట్ర ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇక దేవాలయాల మీద దాడి మా తల్లి మీద దాడిలా భావిస్తామని, దాడులను తప్పకుండా తిప్పికొడతామని ఏలేటి స్పష్టం చేశారు.


Advertisement

Next Story