ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో కీ రోల్ వాళ్లదే..!

by karthikeya |
ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో కీ రోల్ వాళ్లదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌లో జిల్లా ఇన్ చార్జి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో వారు కీ రోల్ పోషించేలా హౌజింగ్ శాఖ ప్రొవిజినల్ రూల్స్ లో నిబంధనలు పొందుపర్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన నిబంధనలపై త్వరలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం ఏర్పాటు రివ్యూ చేయనున్నట్లు సమాచారం. మంత్రుల సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాత ఫైనల్ చేయనున్నట్లు తెలిసింది.

జనాభా ప్రాతిపదికన..

సాధారణంగా గృహ నిర్మాణ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తారు. అయితే, ఇందిరమ్మ స్కీమ్ లో ఒక కొత్త తరహా విధానాన్ని ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆయా ప్రాంతాల్లో సామాజిక సమీకరణాల వారీగా, జనాభాను బట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఉదాహరణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80 శాతానికి పైగా గిరిజనులే నివసిస్తారు. అక్కడ 1/70 చట్టం ప్రకారం.. గిరిజనేతరుల చేతుల్లో భూమి ఉండే ఆస్కారం తక్కువ. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ముస్లింలు అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు సమతుల్యం చేసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇండ్లను జనాభా ప్రాతిపదికన ఇండ్లను ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే, ఎక్కడ ఎంత ఇచ్చామో? ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో? లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుందని హౌజింగ్ శాఖ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు.

స్థల విస్తీర్ణంపై సీఎం నిర్ణయమే ఫైనల్

గ్రామాలు, పట్టణాల్లో సొంతగా ఎంత స్థలముంటే లబ్ధిదారునిగా ఎంపిక చేయాలనే అంశంపై సీఎం నిర్ణయమే ఫైనల్ కానున్నట్లు తెలిసింది. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను 125 గజాల్లో నిర్మించారని అధికారులు చెప్పారు. అయితే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కోసం ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరమన్న దానిపై సీఎం, హౌసింగ్‌ మినిస్టర్,, గృహ నిర్మాణ, మున్సిపల్‌, గ్రామీణాభివృద్థి శాఖ ముఖ్య కార్యదర్శులు నిర్ధారిస్తారని పేర్కొన్నారు. అయితే పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలు 125 గజాల స్థలం కలిగే అవకాశముంటా అనే అంశంపైనా సమాలోచనలు చేస్తున్నారు. అయితే సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాక.. ఆయన సూచనలతో స్వల్ప మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు.

ఎమ్మెల్యేలదీ కీలక పాత్ర

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో స్థానిక శాసనసభ్యులు కూడా కీలక పాత్ర పోషించే వెసులుబాటును ప్రభుత్వం ఇవ్వనుంది. తెలంగాణ హౌజింగ్ శాఖ పేర్కొన్న నిబంధనలతోపాటు ఎమ్మెల్యేలు కూడా అర్హులను రాటిఫై చేయాల్సి ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయంపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన అంశాలపై ఇటు ప్రభుత్వం, అటు గృహ నిర్మాణ శాఖలో చర్చ జరుగుతున్నది. ఈ అంశంపై మరి కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుందని హౌజింగ్ డిపార్ట్ మెంట్ వర్గాలు తెలిపాయి.

ప్రొవిజనల్ రూల్స్ ఇలా..

  • తెలంగాణకు చెందిన వ్యక్తి అయి ఉండాలి.
  • సొంత స్థలం కల్గి ఉండి, దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి.
  • సామాజిక, ఆర్థిక సర్వే-2011లో ఇండ్లు లేని వారిగా పేరు నమోదై ఉండాలి.
  • సొంత స్థలం, దాని పూర్వ వివరాలు ఆన్‌లైన్‌లో పక్కాగా ఉండాలి.
  • ఇదివరకు ప్రభుత్వం నుంచి ఏ గృహ నిర్మాణానికి లబ్ధిదారులుగా ఉండరాదు.
  • స్థానికంగా ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకొని సహేతుక వివరణ ఇవ్వాలి.
  • లబ్ధిదారుల పేర్లను గ్రామసభల్లో ప్రకటించి, ఎటువంటి అభ్యంతరం లేకుండా చూడాలి.
  • సొంత జాగ ఉన్న వారికి ఆన్‌లైన్‌లో స్థలాన్ని ట్యాగ్‌ చేసే విధంగా ఉండాలి.
Advertisement

Next Story

Most Viewed