రాజీ పడకండి.. సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ నారాయణ విజ్ఞప్తి

by Gantepaka Srikanth |
రాజీ పడకండి.. సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ నారాయణ విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంపూర్ణ మద్దతు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రా అనే పులి మీద స్వారీ చేస్తున్నారని, దాని మీద నుంచి కిందికి దిగితే అది మింగేస్తుందని, అందుకే కిందికి దిగకుండా ఆ స్వారీని కంటిన్యూ చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వయంగా ముఖ్యమంత్రే చెప్పుకున్నట్లుగా హైడ్రా విషయంలో రాజీ పడకుండా ముందుకే సాగాలని, సవాళ్ళను ఎదుర్కోవాలని కోరారు. హైడ్రా ఏర్పాటు నిర్ణయం నగర ప్రజలందరికీ ఎంతో రిలీఫ్ ఇస్తున్నదని, విశాల ప్రయోజనాలను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు తగ్గొద్దని సూచించారు. హైదరాబాద్ సిటీలో చెరువులు, నాలాలు కబ్జాకు గురయ్యాయని, ఫలితంగా చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయని, వర్షపు నీరువెళ్ళడానికి మార్గాలే లేకుండా పోయాయన్నారు.

హైడ్రా ఏర్పాటుతో అక్రమంగా ఆక్రమణలు చేసిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సంపన్నులకు దడ పుడుతున్నదని, అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో నిద్ర పట్టడంలేదన్నారు. వాటితో పాటు పేదలు నిర్మించుకున్న ఇండ్లను కూడా కూల్చివేయక తప్పదని, కానీ దానికి ముందే వారికి ప్రత్యామ్నాయ నివాస వసతిని చూపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు సైతం చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లలో, నాలాలపైన ఉన్నాయని, కానీ అవి ప్రజలకు సర్వీస్ చేస్తున్నాయన్నారు. ప్రైవేటు భవనాలు మాత్రం వ్యాపారం చేసుకుంటూ లాభాలను పోగేసుకుంటున్నాయని, విలాసాలకు నిలయంగా మారాయన్నారు. చెరువుల, నాలాలను ఎవరు ఆక్రమించినా అది ప్రకృతి వైపరీత్యానికి దారితీస్తుందని, సమస్యలు రాకుండా అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలను తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌కు నారాయణ సూచనలు చేశారు.

ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను హైడ్రా కూల్చిన తర్వాత స్వయంగా అక్కడకు వెళ్ళి పరిశీలించిన నారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని, సహకార సమాఖ్య (ఫెడరల్) స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నదన్నారు. అదానీకి ‘సెబీ’ దాసోహమైందని, ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Next Story