Delhi Tour : ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ షెడ్యూల్.. ప్రధానితో భేటీ అయ్యే చాన్స్?

by Ramesh N |   ( Updated:2024-08-16 14:59:50.0  )
Delhi Tour : ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ షెడ్యూల్.. ప్రధానితో భేటీ అయ్యే చాన్స్?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ తుగ్లక్ రోడ్‌లోని సీఎం అధికారిక నివాసంలో ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ భేటీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సైతం పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు, ఉద్యోగ కల్పన సంబంధించి సంస్థ చైర్మన్ యంగ్ లియూ, సీఎం బృందం మధ్య సమావేశం జరిగింది. కాగా రాష్ట్రంలో దాదాపు 400 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడితో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్(ఓఎస్ఏటీ)ను నెలకొల్పడానికి ఫాక్స్‌కాన్ ప్రయత్నిస్తోంది.

ప్రధాని మోడీతో భేటీ అయ్యే చాన్స్?

సీఎం రేవంత్ ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన పెండింగ్ అంశాలను పీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. సీఎం ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ కలిశారు. రాష్ట్రం నుంచి ఆయన రాజ్యసభకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడం గౌరవంగా భావిస్తున్నానని సందర్భంగా అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. సీఎం ఒకటి రెండు రోజులపాటు ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది. పార్టీలో తాజా పరిణామాలు, కొత్త పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో చర్చించనున్నారు. మరోవైపు రైతు రుణమాఫీ అంశాన్ని రాహుల్ గాంధీకి రేవంత్ వివరించనున్నారు.

రాహుల్‌తో ఫాక్స్‌కాన్ చైర్మన్ భేటీ..

ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూ భేటీ అయ్యారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ ఈ విషయాన్ని వెల్లడించారు. మిస్టర్ యంగ్ లియూని కలవడం చాలా ఆనందంగా ఉందని, ప్రపంచంలో సాంకేతిక ఆవిష్కరణల భవిష్యత్తుపై చర్చించినట్లు పేర్కొన్నారు. కాగా, ఫాక్స్‌కాన్ సంస్థ భారత్‌లో ఆపిల్ ఐఫోన్‌ల కాంట్రాక్ట్ తయారీదారు. అయితే కంపెనీ తన ఐఫోన్ ఉత్పత్తి పరిధిని విస్తరించే ప్రక్రియలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed