సెలవులు రద్దు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |
సెలవులు రద్దు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, వరద పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి... ఆదివారం ఉదయం అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి అందిన రిపోర్టులను విశ్లేషించి మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. సెలవులమీద వెళ్ళిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వెంటనే తిరిగొచ్చి విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఎవ్వరికీ సెలవులు ఇవ్వొద్దంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు. వర్షం, వరద పరిస్థితులు చక్కబడేంతవరకూ ఫీల్డులోనే ఉండాలని, 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, అత్యవసర విభాగాల అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని నొక్కిచెప్పారు.

రాష్ట్రంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, పలు జిల్లాలో తలెత్తిన ముంపు సమస్యపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు తదితరులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించి అక్కడి పరిస్థితులను, సహాయక చర్యల్లో ఉన్న అధికారుల గురించి ఆరా తీశారు. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఉన్నందున అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. చీఫ్ సెక్రెటరీ, పోలీసు డైరెక్టర్ జనరల్‌తోనూ సమావేశమై పలు సూచనలు చేశారు. మున్సిపల్, విద్యుత్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, రోడ్లు-భనవనాలు, రెవెన్యూ, వైద్యారోగ్యం తదితర కీలక శాఖల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని నొక్కిచెప్పారు. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు.

తాజా పరిస్థితిని క్షేత్రస్థాయిలో ఉంటూ పర్యవేక్షిస్తూనే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు. అనేక చెరువులు నిండిపోయి ఉన్నందున గండ్లు పడే అవకాశమున్నదని పేర్కొన్న సీఎం రేవంత్... రోడ్లపైకి నీరు వచ్చి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశమున్నదని, అత్యవసర పనులకు మాత్రమే ప్రజలు ఇండ్లను దాటి బైటకు రావాలని, ఇతర అవసరాలను పరిమితం చేసుకుని రిస్కులో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా అంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్‌లలో సమాచారం ఇవ్వాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కాంగ్రెస్ శ్రేణులు సైతం అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం మేరకు పలు జిల్లాల కలెక్టర్లతో రివ్యూ చేసిన చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి... రాష్ట్రంలో మొత్తం 85 చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయని, నీరు పల్లెల్లోకి చేరిందని, పంట పొలాలు మునిగాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని సుమారు రెండున్నర వేల మంది ప్రజలను 45 సహాయక శిబిరాలకు తరలించినట్లు తెలిపారు. రాష్ట్రంలో వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 26 ప్లాటూన్ల పోలీసు రెస్క్యూ టీమ్‌లను పంపించామన్నారు. ప్రజలే కాకుండా అధికారులు సైతం ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి సాయం తీసుకోడానికి, సమాచారాన్ని అందించడానికి సచివాలయంలో ప్రత్యేకంగా 24 గంటలూ పనిచేసే హెల్ప్ లైన్ సెంటర్, కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed