CM Revanth: ఖమ్మంకు బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డి.. వరద బాధితులకు పరామర్శ

by Shiva |   ( Updated:2024-09-02 15:23:19.0  )
CM Revanth: ఖమ్మంకు బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డి.. వరద బాధితులకు పరామర్శ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. మున్నేరు మహోగ్రరూపం దాల్చడంతో జోరు వానకు ఊర్లు, ఏర్లు ఏకమయ్యాయి. పలుచోట్ల కాలువకు పెద్ద పెద్ద గండ్లు పడ్డాయి. ఈ క్రమంలోనే వరద బాధితులను పరామర్శించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కాసేపటి క్రితం ఖమ్మంకు రోడ్డు మార్గంలో బయలుదేరారు. ముందుగా మార్గమధ్యలో కోదాడలో ఆయన వరద బీభత్సం సృష్టించిన ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం ఖమ్మం చేరుకుని అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసానివ్వనున్నారు. రాత్రి అక్కడే బస చేసి.. రేపు మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తారు.

కాగా, అంతకు ముందు ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు. ఈ మేరకు ఆయన జిల్లాల్లో వరదల ప్రభావం, కొనసాగుతోన్న సహాయక చర్యలు, వరద ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులపై అధికారులతో చర్చించారు. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు రూ.4 లక్షలుగా ఉన్న ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షలకు పెంచారు. ఈ సమావేశానికి మంత్రుల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story